వన్టౌన్(విజయవాడపశ్చిమ): యువత భవిత కోసం దేనికై నా సిద్ధమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని, నిరుద్యోగ భృతిని చెల్లించాలని, ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో స్థానిక బాప్టిస్ట్పాలెంలోని ఆ పార్టీ 35వ డివిజన్ కార్యాలయం వద్ద శుక్రవారం చేపట్టిన రిలేదీక్షలు ఉద్రిక్తంగా మారాయి.
దాడికి తెగబడిన టీడీపీ శ్రేణులు
శాంతియుతంగా పార్టీ కార్యాలయం ప్రాంగణంలో చేపట్టిన దీక్షలపై టీడీపీ దాడికి తెగబడింది. ఆ పార్టీ పశ్చిమ ఇన్చార్జిగా నియమితులైన బుద్ధా వెంకన్నను పోలీసు అధికారులు గృహనిర్బంధం చేయగా దాడి చేయాలని, శిబిరాన్ని తీసివేయాలని పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి బాప్టిస్ట్పాలెం వద్దకు పంపించారు. దీంతో ఆ పార్టీ నేతలు కొట్టేటి హనుమంతరావు, గుర్రం కొండ, తుపాకుల రమణమ్మ తదితరుల నేతృత్వంలో టీడీపీ శ్రేణులు దీక్షా శిబిరాన్ని ముట్టడించి దాడికి ప్రయత్నించారు. వారిని సమీపంలోనే పోలీసులు అడ్డుకొని నిలువరించారు.
బొండా ఉమా ఎంతగా రౌడీయిజం చేస్తే అంతగా ఉద్యమిస్తాం
శాంతియుతంగా దీక్షలు చేస్తున్న వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్న తదితరులు ఎంతగా రౌడీయిజం చేస్తే అంతగా ఉద్యమిస్తామని వెలంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. బొండా ఉమా అరాచకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి వందలాది యువకుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పకపోగా దాడులకు పాల్పడటం వారి దుర్మార్గాలకు నిదర్శనమన్నారు. మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు వారసత్వంలో పుట్టినవాడినని, ఉద్యమాలకు వెనుకాడబోనని వెలంపల్లి హెచ్చరించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గంజాయి అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.


