3 డైరెక్టర్ పోస్టులకు 7 నామినేషన్లు వాటిలో 3 నామినేషన్ల తిరస్కరణ నేడు నామినేషన్ల ఉపసంహరణ
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ)లో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేలా కనిపిస్తున్నాయి. విజయ డెయిరీ ఆవరణలోని క్షీరదర్శని హాల్లో అసి స్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీ (రిటైర్డ్) ఎన్నికల అధికారి ఎల్.గురునాథం నామినేషన్లు స్వీకరించారు. మూడు డైరెక్టర్ల పోస్ట్లకు ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో మూడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మరో నాలుగు నామినేషన్లు మిగి లాయి. గురువారం సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ప్రస్తుతానికి పోటీలో చలసాని ఆంజనేయులు, పల్లగాని రాంబాబు, చలసాని చక్రపాణి, గొంది నరేంద్ర మిగిలారు. అయితే ప్రస్తుతం ఖాళీ అయిన మూడు స్థానాల్లో చలసాని ఆంజనేయులు, పల్లగాని రాంబాబు, చలసాని చక్రపాణిని ఏకగ్రీవం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. గొంది నరేంద్రను బుజ్జగించి గురువారం మధ్యాహ్ననికి నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒప్పించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. నామినేషన్ల పక్రియ నేపథ్యంలో ఎటువంటి వివాదాలు జరగకుండా కొత్తపేట సీఐ చినకొండలరావు పర్యవేక్షణలో 30 మందికి పైగా సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. నామినేషన్ల నేపథ్యంలో ఇటీవల కృష్ణా మిల్క్ యూనియన్పై అనేక ఆరోపణలు చేసిన వ్యక్తి తనను లోపలకు అనుమతించాలని తమ మద్దతు దారులతో డెయిరీ వద్దకు చేరుకున్నారు. అయితే సంఘం గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే లోపలకు అనుమతిస్తామని పోలీసులు తేల్చి చెప్పడంతో వారిపైన, అక్కడకు చేరుకున్న మీడియా సిబ్బందిపైన అతను ఆగ్రహం వ్యక్తం చేశారు.
నామినేషన్ల తిరస్కరణకు కారణాలు ఇవీ...
దాఖలైన ఏడు నామినేషన్లలో మూడు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు ఎన్నికల అధికారి ఎల్.గురునాథం పేర్కొన్నారు. మూల్పూరు రామ్మోహన్, మర్రెడ్డి బసివిరెడ్డి, పాలడుగు వసంతకుమార్ సమర్పించిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ ముగ్గురు ప్రాతి నిధ్యం వహిస్తున్న సంఘాలు, మద్దతుదారులు సమితికి బకాయిలు ఉన్నందున వారి నామినేషన్లను తిరస్కరించారు.


