కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపీ
చిలకలపూడి(మచిలీపట్నం): రాజీపడదగిన కేసుల్లో మధ్యవర్తిత్వంతో కేసులను పరిష్కరించుకోవడం ఉత్తమమని కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టల గోపీ సూచించారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మీడియేషన్ ఫర్ నేషన్ 3.0 నినాదంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బందితో బందరులోని జిల్లా కోర్టు నుంచి సాయిబాబా గుడి సెంటరు వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం మానవహారం నిర్మించారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ.. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న కేసులను పరిష్కరించేందుకు ఈ సంవత్సరం ఇప్పటికే రెండు సార్లు నిర్వహించిన మీడియేషన్ ఫర్ నేషన్ కార్య క్రమం విజయవంతమైందన్నారు. వేల కేసులను పరిష్కరించామని వివరించారు. జిల్లాలో 99 మంది ప్రత్యేక శిక్షణ పొందిన మధ్యవర్తుల ద్వారా వందల కేసులు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. జిల్లా కోర్టులోని న్యాయసేవాసదన్లో మీడియేషన్ సెంటర్ నిరంతరం పనిచేస్తోందన్నారు. తొలుత కోర్టు ప్రాంగణంలోని మీడియేషన్ అవేర్నెస్ సెంటరును ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. సాయంత్రం మీడియేషన్ ఫర్ నేషన్ 3.0పై న్యాయసేవా సదన్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మీడియేషన్ ఫర్ నేషన్ 3.0 కార్యక్రమం డిసెంబరు 30వ తేదీ వరకు కొనసాగ నున్న నేపథ్యంలో రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి మధ్యవర్తిత్వానికి పంపాలని ప్రధాన న్యాయమూర్తి గుట్టల గోపీ సూచించారు. సెప్టెంబరు 12న నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్జిలు జి.వెంకటేశ్వర్లు, దుర్గాపూర్ణిమ, టి.రాజావెంక టాద్రి, సీహెచ్.యుగంధర్, ఎండీ రహ్మతుల్లా, పి.సాయిసుధ, పర్మనెంట్ లోక్అదాలత్ చైర్మన్ ఓ.బి.నాగేశ్వరరావు, న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎస్.వరలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.హరిబాబు, పలువురు న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.


