● జీజీహెచ్లో సీటీ స్కాన్కు.. పదేపదే మరమ్మతులు ● నిర్వహణ లోపమేనా? ● రోగులకు ఇబ్బందులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రి సూపర్స్పెషాలిటీ బ్లాక్లోని సీటీ స్కాన్ యంత్రం నిర్వహణ లోపం కారణంగా తరచూ మరమ్మతులకు గురవుతోంది. రిపేరు చేసి మళ్లీ అందుబాటులోకి తీసుకురావడానికి రెండు, మూడు వారాలు సమయం పడుతుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూపర్స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి అత్యాధునిక సిటీ స్కాన్ యంత్రం మూలన పడటంతో రోగులకు పలు పరీక్షలు నిలిచి పోతున్నాయి . గత ప్రభుత్వంలో ఏదైనా యంత్రం మరమ్మతులకు గురైతే, వెంటనే రిపేరు చేసి అందుబాటులోకి తెచ్చేవారు. కానీ నేడు రెండు మూడు వారాలు పడుతుండటంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు.
జీజీహెచ్లో రెండు సీటీ స్కాన్ యంత్రాలు
విజయవాడ జీజీహెచ్లో రెండు సీటీ స్కానింగ్ యంత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏ బ్లాక్లో పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తుండగా, రెండో స్కానింగ్ యంత్రం సూపర్స్పెషాలిటీ బ్లాక్ మొదటి అంతస్తులో ఉంది. వీటిలో పీపీపీ పద్ధతిలో నిర్వహించే స్కానింగ్యంత్రంపై నిత్యం 150 మంది వరకూ స్కానింగ్లు చేస్తుంటారు. సూపర్స్పెషాలిటీ బ్లాక్లోని సీటీ స్కానింగ్ యంత్రంపై 50 నుంచి 60 మందికి స్కాన్లు చేస్తుంటారు. వారం రోజులుగా సూపర్ స్పెషాలిటీ బ్లాక్లోని సీటీ మరమ్మతులకు గురవడంతో, అన్ని స్కాన్లు ఏ బ్లాక్లోనే తీయాల్సి వస్తోంది. దీంతో ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తుందని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అత్యాధునిక స్కాన్పై నిర్లక్ష్యం
సూపర్స్పెషాలిటీ విభాగాలైన కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల్లోని రోగులకు అవసరమైన స్కాన్లు తీసేందుకు 128 స్లైస్ కెపాసిటీ కలిగిన సీటీ స్కాన్ యంత్రాన్ని గత ప్రభుత్వంలో సమకూర్చారు. దీనిపై గుండె, మెదడు రక్తనాళాల్లోని పూడికలు గుర్తించడమే కాకుండా, కిడ్నీల పనితీరు, కిడ్నీ రక్తనాళాలు స్కాన్ చేసే అవకాశం కూడా ఉంది. అలాంటి అత్యాధునిక సీటీ స్కాన్ యంత్రం నిర్వాహణ లోపం కారణంగా తరచూ మరమ్మతులకు గురవుతోంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.


