● కూటమి నేతలే మాఫియాగా మారారు ● కార్పొరేషన్లో స్థలాలు ఆక్రమించి అమ్మేసుకుంటున్నారు ● కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన దేవినేని అవినాష్, మల్లాది విష్ణు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి నేతలు మాఫియాగా ఏర్పడి ఇసుక, మట్టి, బియ్యం అక్రమ రవాణా యథేచ్చగా సాగిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ఇసుక, మట్టి, బియ్యం మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అవినాష్ మాట్లాడుతూ కూటమి నేతలు మాఫియాగా తయారై కార్పొరేషన్ స్థలాలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అధికారుల సహకారంతో జేఎన్యూఆర్ఎం ఇళ్లను టీడీపీ కార్యకర్తలు, వాళ్లకు సంబంధించిన వ్యక్తులకు అమ్ముకుంటున్నారన్నారు. కూటమి నేతల మాఫియా ఇసుక, మట్టి, బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. దీనిపై అనేక పర్యాయాలు కలెక్టర్కు, అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. మాఫియాపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరామన్నారు. లేని పక్షంలో అక్రమాలపై వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
నగరంలో జరుగుతున్న దోపిడీని వివరించాం
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ జిల్లాతో పాటు విజయవాడలో జరుగుతున్న దోపిడీని కలెక్టర్కు చెప్పామన్నారు. ఒక్క నెలలోనే నున్న పోలీసు స్టేషన్ పరిధిలో రెండు బియ్యం లారీలను పట్టుకున్నారని దీని వెనక ఉన్న వ్యక్తులను వదిలి పెడుతున్నారు. వీటి వెనక ఉన్నదెవరో యంత్రాంగం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. సాక్షాత్తు తిరువూరు ఎమ్మెల్యే మట్టి దోపిడీ జరుగుతోందని స్టేటస్ పెట్టారన్నారు.
ప్రభుత్వ స్థలాలను అమ్మేస్తున్నారు..
కార్పొరేషన్ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూములను కూటమి నేతలు అక్రమంగా అమ్మేసుకుంటున్నారని ఆరోపించారు. సెంట్రల్లో 10 చోట్ల ప్రభుత్వ స్థలాల్ని అమ్మేశారన్నారు. వీటన్నిటిపై ఆధారాలతో సహా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించామన్నారు. తాము ఇచ్చిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి, మాఫియాపై చర్యలు తీసుకోకపోతే 15 రోజుల తర్వాత వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన చేస్తామన్నారు. కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఓటర్ల జాబితాలోని డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కలెక్టర్ను కోరారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 22–ఏ అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశం మందిరంలో జరిగిన కార్యక్రమంలో 22ఏ నుంచి తొలగించి భూ యాజమాన్య హక్కుల పునరుద్ధరణకు సంబంధించిన ఏడు కేసులకు సంబంధించి 75.41 ఎకరాల భూమికి విముక్తి కల్పించి కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఎస్.ఇలక్కియ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 22(ఏ) కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు పరిష్కారమైన కేసులకు సంబంధించి అర్జీదారులకు పత్రాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. 22ఏ నిషేధిత భూముల జాబితాలో పొరపాటున నమోదైన పట్టా భూముల తొలగింపు అధికారం రెవెన్యూ డివిజనల్ అధికారులకు బదలాయించడంతో మరింత వేగంగా అర్జీల పరిష్కారం జరుగుతుందన్నారు.


