ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రావణ మాసంలో నూతన లడ్డూపోటు, అన్నదాన భవనాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దుర్గగుడి అధికారులను ఆదేశించారు. శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో నిర్మిస్తున్న అన్నదాన భవనం, లడ్డూపోటు భవనాలను సోమవారం రామచంద్రమోహన్ పరిశీలించారు. తొలుత ఆ భవనాల లోపల జరుగుతున్న పలు పనులను పరిశీలించిన ఆయన దుర్గగుడి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆగస్టు 15 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్నదాన భవనంలో భక్తులు కూర్చునే హాల్, వంటశాల, భక్తులు చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశంతో పాటు అన్నదానం హాల్లోకి భక్తులు ప్రవేశించే మార్గం, బయటకు వచ్చే మార్గాలను పరిశీలించి సూచనలు ఇచ్చారు.
తుది పనులు పూర్తి చేయండి
అనంతరం కమిషనర్ రామచంద్రమోహన్ మీడియాతో మాట్లాడుతూ నూతన అన్నదాన, లడ్డూ పోటు భవనం పనుల పురోగతి సంతృప్తికరంగానే జరుగుతున్నాయన్నారు. మరో పక్షం రోజుల్లో రెండు భవనాలకు సంబంధించి అన్ని సివిల్, ఇంజినీరింగ్, తుది మెరుగులు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించామన్నారు. కార్యక్రమంలో దుర్గగుడి ఈవో శీనానాయక్, దేవదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ జీవీఆర్ శేఖర్, ఈఈ ఎల్.రమాదేవి, డీఈఈలు, ఏఈఈలతో పాటు ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


