అక్రమ కేసులు, వేధింపులపై పోరాడుతాం మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ అరుణకుమార్
నందిగామటౌన్: కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తోందని మాజీ శాసనసభ్యుడు మొండితోక జగన్మోహనరావు, శాసన మండలి సభ్యుడు డాక్టర్ మొండితోక అరుణకుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఆదివారం వారు మరో 12 మందితో కలిసి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జగన్మోహనరావు, అరుణకుమార్ మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు అధికార అహంకారంతో ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయ స్థానాలపై నమ్మకం ఉందన్నారు. అక్రమ కేసులు, అధికార పార్టీ వేధింపులను చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. గడిచిన రెండేళ్లుగా రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. రెండేళ్లలో తమపై 14 అక్రమ కేసులు నమోదయ్యాయని తెలిపారు. గ్రామాల్లో టీడీపీ గూండాలు తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై విచక్షణరహితంగా దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసుల నమోదులో రాష్ట్రంలోనే నందిగామ ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. సామాన్యులు, మహిళలు అనే తేడా లేకుండా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కూటమి నేతలు పోలీసుల సహకారంతో కేసులు నమోదు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రజలు గమనిస్తున్నారని వారే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఈశ్వరప్రగడ రంగారావు, వెలది సాయి శ్రీ హర్ష, మంగళపూడి కోటి, సన్ని, నాయకులు నెలకుదిటి శివనాగేశ్వరరావు, షేక్ కరీముల్లా, షేక్ యాకుబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.


