రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే దిశగా ఎనిమిది ఆర్ఓబీల నిర్మాణాలపై దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథ్యుర్ను కలసి పలు రైల్వే ప్రాజెక్ట్లపై చర్చించినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ డివిజన్లో శనివారం పర్యటించిన జీఎంను కలసిన ఆయన పలు రైల్వే ప్రాజెక్ట్లకు సంబంధించి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎనిమిది రైల్వే ఆర్ఓబీల నిర్మాణాలపై జీఎంతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలను కలిపే ఎర్రకట్ట వంతెన, గుణదల ఎల్సీ గేటు నంబర్ 8 వద్ద ఆర్వోబీ నిర్మాణం ఎంతో అత్యవసరమని జీఎంకు స్పష్టం చేసినట్లు తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు ప్రాజెక్ట్ వేగవంతం అయ్యేలా కేంద్ర రైల్వే శాఖతో ప్రత్యేకంగా చర్చిస్తామని తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మరింత అభివృద్ధి చేయాలని రాష్ట్రంలోని ఎంపీలందరం కలసి కేంద్ర మంత్రిని కోరనున్నట్లు తెలిపారు. విజయవాడ–బెంగళూరు మధ్య కొత్త రైలు ఏర్పాటు చేస్తే రాజధానికి వచ్చే విద్యార్థులు, వ్యాపారస్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, కొండపల్లి రైల్వే స్టేషన్ను కూడా అమృత్ భారత్ పథకంలో చేర్చి అభివృద్ధి చేయాలని జీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్ ప్రాజెక్ట్లపై జీఎంకు వినతిపత్రం


