గుంటుపల్లి(జి.కొండూరు): మహిళలు నైపుణ్యం పెంచుకొని స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవడం వల్లన ఆర్థికంగా ఎదగొచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. జి.కొండూరు మండలంలోని గుంటుపల్లి రైజ్ కేంద్రంలో హస్తకళా ఉత్పత్తులపై శనివారం నిర్వహించిన వర్క్ షాపును కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రావ్స్ ఎండ్ లెస్ క్రాఫ్టస్ వ్యవస్థాపకురాలు శ్రావణి 60 మంది స్వయం సహాయక సంఘ మహిళలకు బొకేలు, అలంకరణ వస్తువులు, ఆకర్షణీయ బహుమతుల తయారీలో శిక్షణ ఇచ్చారు. డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్.వి.నాంచారరావు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): తెలంగాణ నుంచి దుర్గమ్మకు ఆదివారం బంగారు బోనం, ఆషాఢ సారె నేపథ్యంలో అన్ని వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు దుర్గగుడి ఈఓ శీనానాయక్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ బోనం సమర్పణకు సుమారు మూడు వేల మంది కళాకారులు, ఉత్సవ కమిటీ సభ్యులు వస్తారని తెలిపారు. గత ఆదివారం ఒక్క రోజే సుమారు 85 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. ఈ ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నామని వివరించారు. మరో వైపున కొండపైకి ఎటువంటి ప్రయివేటు వాహనాలను అనుమతించేది లేదని, దేవస్థానం బస్సులను పూర్తి స్థాయిలో నడుపుతామని తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులు, చంటి బిడ్డల తల్లులు ఉదయం ఎనిమిది గంటల్లోపు, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు రావా లని సూచించారు. రద్దీ దృష్ట్యా దేవస్థ్ధానం తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులందరూ సహకరించాలని ఆయన కోరారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో కరోనా యాక్టివ్ కేసులు రెండు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం తెలిపారు. తొలుత కరోనా పాజిటివ్ వచ్చిన తిరువూరు చెందిన 13 ఏళ్ల బాలికకు ప్రస్తుతం నెగటివ్ వచ్చింది. విజయవాడ లోని ఓ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అతనికి కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. మరో 85 ఏళ్ల వ్యక్తికి సైతం కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో రెండు కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. విజయవాడలో చాలా మంది జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడుతుండగా, ఒకటి రెండు రోజులు ఉండి తగ్గి పోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రజలు అవగాహనతో కరోనా నిబంధనలు ఎప్పటిలా పాటిస్తే మంచిదని, ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, మధుమేహులు రక్తపోటు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


