చుట్టుముడుతున్న శారీరక, మానసిక సమస్యలు అదుపులో ఉండని మధుమేహం, రక్తపోటు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్కు దారితీస్తున్న వైనం మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతతో సమస్యలు
తీవ్ర ఒత్తిడితో నిద్ర కరువై.. బతుకు భారం
జాగ్రత్తలు పాటించాలి..
ఇలా అధిగమించొచ్చు..
రోజూ ఏడు గంటలు తగ్గకుండా నిద్రపోవడం, ఒకే సమయానికి రోజూ నిద్రించడం చేయాలి.
సమతుల ఆహారం తీసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
యోగా, మెడిటేషన్పై దృష్టి సారించాలి.
సెల్ఫోన్ చూడటం మాని, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి.
భావోద్వేగాలు, ప్రవర్తనలపై అదుపు కలిగి ఉండాలి.
అసమానతలు, సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోవాలి.
ఒత్తిడితో దుష్ఫలితాలు ఇవీ..
నిద్ర పట్టక పోవడం
ఆకలి లేక పోవడం లేదా ఎక్కువ ఆహారం తినడం
ఎక్కువ తినేవారు ఊబకాయం బారిన పడటం
హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మహిళల్లో పీరియడ్స్ ఇబ్బందులు
మధుమేహం, రక్తపోటు ఉన్న వారిలో ఆ రోగాలు అదుపులో లేకపోవడం
ఒత్తిడి ఉన్న వారిలో హృద్రోగ సమస్యలు
వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో ఇన్ఫెక్షన్లు సోకడం
● విజయవాడ గాంధీనగర్కు చెందిన 40 ఏళ్ల రాజుకు ఓ కార్పొరేట్ సంస్థలో మంచి ఉద్యోగం వచ్చింది. ఏడాది క్రితం ఉద్యోగం కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. నిద్ర పట్టక పోవడం, ఆలోచనలు ఎక్కువ కావడంతో తలనొప్పి, ఇతర రుగ్మతలు చుట్టుముట్టాయి. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా.. ఎటువంటి జబ్బూ లేదని, ఒత్తిడి కారణమని తేల్చారు.
ఇలా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు అన్ని వర్గాలకు చెందిన వారు శారీరక, మానసిక రుగ్మతలకు గురవుతున్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆధునిక యుగంలో రాణించాలంటే ఉరుకులు పరుగుల జీవనం తప్పదు. ఈ క్రమంలో కంటినిండా నిద్ర ఉండదు. ఫలితంగా ఎంతో మంది ఒత్తిడికి లోనై వ్యాధుల బారిన పడుతున్నారు. తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే వారిలో శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, హార్మోన్ల సమతుల్యత లోపించడం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు అదుపు తప్పు తున్నాయి.
కొరవడిన మానసికోల్లాసం..
ప్రస్తుతం కుటుంబాల్లో మానసిక ఉల్లాసం లోపించిందనే చెప్పాలి. ఆధునిక యుగంలో రాణించాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. విధులు ముగించుకుని ఇంటికి వచ్చాక, ఎవరి ఫోన్తో వారు కాలక్షేపం చేస్తుంటారు. కొందరు కనీసం పిల్లల గురించి పట్టించుకోవడం లేదు. కుటుంబం అంతా కలిసి మాట్లాడుకునే పరిస్థితులు లేవు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం అంతకంటే లేదు. దీంతో మానసిక ఉల్లాసం కొరవడుతోందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. సాయంత్రం వేళ పిల్లలతో కాసేపు సమీపంలోని పార్కుకు వెళ్లి గడపడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుందంటున్నారు. కొత్త ప్రాంతాలను సందర్శించడం, ఆటలపై దృష్టి పెట్టడం వంటి చేయాలి.
మధుమేహుల్లో ఒత్తిడి ప్రభావం
ప్రస్తుతం యువత ఎక్కువగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. వారిపై సెల్ఫోన్, సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటోంది. యువత వాటికి బానిసలుగా మారడంతో ఇతర అంశాలపై దృష్టి సారించలేక పోతున్నారు. చదువులో రాణించలేక పోవడం, ఉద్యోగంలో పనిపై దృష్టిపెట్ట లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు, ఇలా అనేక రంగాల వారు ఈ సమస్యలతో కౌన్సెలింగ్ కోసం మా వద్దకు వస్తున్నారు. దేనినైనా అవసరం మేరకు వినియోగించాలి. మానసిక ఉల్లాసం కోసం కొత్త ప్రాంతాలను సందర్శించడం, ఆటలు వంటి వాటిపై దృష్టి సారించాలి.
– డాక్టర్ గర్రే శంకరరావు,
సైకాలజిస్టు
మధుమేహం, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి మధ్య సంబంధం ద్విముఖమైనది. దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో కార్టిసోల్, ఇతర స్ట్రెస్ హార్మోన్లను పెంచి ఇన్సులిన్ పనితీరును దెబ్బతీస్తుంది. ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికమవుతాయి. ముఖ్యంగా ప్రీ డయాబెటిస్ ఉన్నవారిలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించి టైప్–2 డయాబెటిస్కు మార్పు వేగవంతం కావచ్చు. నిద్రలేమి, అనియంత్రిత ఆహారం, శారీరక చురుకుదనం తగ్గడం వంటి అంశాలు ఈ ప్రక్రియను మరింత తీవ్రతరం చేస్తాయి. మధుమేహ చికిత్సలో చక్కెర నియంత్రణతో పాటు, భావోద్వేగ ఆరోగ్యాన్ని సమానంగా పరిగణించే వైద్య విధానం అనుసరించాలి.
– డాక్టర్ ఎం.శ్రీకాంత్, మధుమేహ వ్యాధి నిపుణుడు


