మోపిదేవి: ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు ఆర్థిక సహకారం కోటి రూపాయలతో తయారుచేసిన కొయ్య రథాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డులో గురువారం భద్రపరిచారు. మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానానికి స్వామివారి బ్రహ్మోత్సవాలకు గాను బహూకరించిన ఈ రథాన్ని ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో సినీ నిర్మాత నారాయణరావుతో వేదపండితులు ఉదయం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం టీటీడీ కల్యాణ మండపంలో నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్డులో రథాన్ని భద్రపరిచినట్లు ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు వెల్లడించారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రావి రత్నగిరి, ఆలయ అఽధికారులు బర్మా ప్రసాద్ పాల్గొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: జిల్లా విద్యాశాఖ అధికారుల సూచనల మేరకు ఈ నెలలో వచ్చే రెండో శనివారం పాఠశాలలు పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. భారీ వర్షాలు, మోంథా తుపాను కారణంగా గతంలో ప్రకటించిన సెలవులకు మార్చి 14 తేదీ పరిహార పనిదినంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించామన్నారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.
ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వేసవి విద్యుత్ వినియోగం పెరిగిందని, వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీసీపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఎస్ఈ, ఈఈ, డీఈలు, రెవెన్యూ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు త్వరితగతిన ఇవ్వాలని ఆదేశించారు. ఫీడర్లు బ్రేక్ డౌన్ కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ కలెక్షన్స్ నూరు శాతం పూర్తి చేయాలన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని అందరికీ అందేట్లు చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సర్వీస్లకు ఉచితంగా ఇచ్చే సోలార్ సర్వీస్ల ప్రోగ్రెస్ను ఆరా తీశారు. సమీక్ష సమావేశంలో డైరెక్టర్ టెక్నికల్ మురళీకృష్ణ యాదవ్, డైరెక్టర్ ప్రాజెక్టు టీవీఎస్ఎన్ మూర్తి, డైరెక్టర్ ఫైనాన్స్ వెంకటేశ్వర్లు, సీజీఎం జైకిషోర్ బాబు, ఎన్టీఆర్ జిల్లా ఎస్ఈ హనుమయ్య పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. ప్రపంచ కిడ్నీ డేను పురస్కరించుకుని ఏపీ నెఫ్రాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం వాక్థాన్ నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద వాక్థాన్ను సీపీ ఎస్వీ రాజశేఖరబాబు జెండా ఊపి ప్రారంభించగా, ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మధుమేహం, రక్తపోటు ఉన్న వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, నెఫ్రాలజిస్ట్స్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.అమ్మన్న, సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎంవీ సాయికృష్ణ, విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్ చైర్మన్ టి.అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.


