కొండపల్లి(ఇబ్రహీంపట్నం): త్వరలో నిర్వహించనున్న టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలపై విద్యాశాఖ అధికారులకు సోమవారం కొండపల్లి డీఏవీ పాఠశాలలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎల్.చంద్రకళ మాట్లాడుతూ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమవ్వాలని, పరీక్షలు సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష హాలులో తాగునీరు, ఫ్యాన్లు, టాయిలెట్, వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అవకతవకలు జరగకుండా పేపర్ కోడ్ ఆధారంగా ఏరోజు ప్రశ్నపత్రం ఆ రోజే అందేలా చూడాలన్నారు. వివిధ డివిజన్ల డీవైఈవోలు, ఎంఈవోలు పాల్గొన్నారు.
బంటుమిల్లి: భర్త, అత్త వేధింపులు భరించేని వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని అర్తమూరు గ్రామంలో విషాదం నింపింది. పోలీసు కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాకాల రాజగోపాల్ కుమార్తె లిఖిత(26)ను ఆగిరిపల్లి మండలం, కొత్తఈదర గ్రామానికి చెందిన బెక్కం కిరణ్కు ఇచ్చి 2024 నవంబరు 16వ తేదీన వివాహం చేశారు. వివాహం తర్వాత భార్యభర్తలు ఉద్యోగం నిమిత్తం యునైటెడ్ కింగ్డమ్ (యుకే) వెళ్ళారు. అక్కడ కిరణ్ జాబ్ సక్రమంగా లేదని భావించిన పోలీసులు భార్యభర్తలను ఇండియాకు పంపారు. అత్తారింటికి చేరిన లిఖితకు అత్త, భర్తల సూటిపోటీ మాటలతో వేధింపులు మొదలయ్యాయి. యుకేలో కిరణ్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేశాడు. అత్తారింట్లో ఎదురైన వేధింపులను తోబుట్టువులకు ఫోన్ల్ చేసి చెప్పుకుంది. ఈ స్థితిలో కట్నంగా ఇచ్చిన పొలం అమ్ముకుని డబ్బులు తీసుకురమ్మని కిరణ్ లిఖితను బెదిరించడంతో నాలుగు రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న లిఖిత సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయములో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి అన్న మాకాల సాయిసూర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ గణేష్కుమార్ కేసు నమోదు చేశారు.


