అధికారులు ఎక్కడ..?
అధికారుల ఉదాసీనతతో చోరుల చేతివాటం ఆలయాల్లో హుండీలే టార్గెట్ పాపం పండి ముగ్గురు అరెస్టు
పెనమలూరు: యనమలకుదురు గ్రామంలో కొండ పై వేంచేసి ఉన్న శ్రీపార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానం నిధులు స్వాహా చేయటం గుడి చరిత్రలో ఎప్పుడు జరగలేదు. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలపై కన్నేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి, ఇద్దరు అర్చకులు, గుడిలో పని చేసే కార్మికుడు స్వాహా చేయటం భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎంతో శక్తివంతమైన శ్రీరామలింగేశ్వరస్వామివారి ఆలయంలో సిబ్బంది దొంగతనానికి పాల్పడటం భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ఎంతో నమ్మకంతో స్వామి వారికి సమర్పించిన కానుకలను అధికారులు భద్రపర్చాల్సి ఉండగా చేతివాటం చూపటంతో భక్తులు తీవ్ర ద్రిగ్భ్రాంతికి గురయ్యారు. శివశివా అపచారం జరిగిందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆలయం అభివృద్ధే లక్ష్యంగా...
స్వయం భూగా వెలిసిన శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయాన్ని అభివృద్ధే లక్ష్యంగా దాత సంగా నరసింహారావు ఇప్పటి వరకు రూ.50 కోట్లు నిధులు పైగా వెచ్చించి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. భక్తులు కూడా తమ వంతు సాయంగా ఆలయ అభివృద్ధికి దోహదపడ్డారు. ప్రభుత్వం నుంచి నిధులు సమకూరక పోయినా దాతఉ ముందుకు వచ్చి భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. శ్రీరామలింగేశ్వరస్వామివారి ఆలయానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది.
ఆదాయం తగ్గటంతో అనుమానం...
కాగా శ్రీ రామలింగేశ్వరస్వామివారికి కార్తీక మాసం, మహాశివరాత్రితో పాటు ఇతర పండుగలకు భక్తులు స్వామివారికి కానుకలు సమర్పిస్తారు. ఏడాదికి మూడుసార్లు హుండీలో కానుకలు లెక్కిస్తారు. రెండేళ్లుగా భక్తులు పెరుగుతున్నా స్వామివారి హుండీ ఆదాయం తగ్గింది. దీంతో అనుమానం వచ్చి నిఘా ఉంచారు. సీసీ కెమేరాలు కూడా గోప్యంగా ఏర్పాటు చేశారని సమాచారం. దీంతో స్వామివారి హుండీలలో సొమ్ము స్వాహా చేసిన దొంగలు చిక్కారని తెలిసింది. స్వాహా చేసి సొమ్ము ఈవో వేరే ఖాతాకు బదిలీ చేసినట్లు ఆధారాలు పోలీసులకు దొరికాయని సమాచారం.
సొమ్ము చోరీలో ముగ్గురు అరెస్ట్..
ఆలయం సొమ్ము స్వాహా చేసిన కేసులో పోలీసులు సోమవారం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు సాగర్, అర్చకుడు పూర్ణ, గుడిలో పని చేసే కార్మికుడు రోశయ్యలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారన్నారు. దీంతో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.భవానిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. ఆమెను కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు.
దేవస్థానంలో భారీ అవినీతి బయటపడినా దేవదాయ శాఖ అధికారులు జాడ లేదు. ఆలయ రికార్డులు స్వాధీనం చేసుకోలేదు. నకిలీ తాళాలతో హుండీ తెరిచారన్న ఆరోపణలు వచ్చిన వెంటనే అధికారులు ఆలయానికి వచ్చి తాళాలు తనిఖీ చేయలేదు. తాళాలు మార్చలేదు. ఆలయ సొమ్ము చోరీపై ఉన్నతాధికారులు సైతం స్పందించినట్లు కనబడ లేదు. ఈ విషయమై ఏసీ సాంబశివరావును వివరణ కోరగా హుండీలు తనిఖీ చేస్తానని, ఆ తరువాత రికార్డులు పరిశీలిస్తామన్నారు.


