రుద్రూర్: పర్యావరణాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామ పంచాయతీ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించేందుకు సర్పంచ్ శ్వేత సూర్యకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక తీర్మానం చేసింది. ఈ మేరకు శనివారం గ్రామంలోని హోటళ్లకు స్టీల్ గ్లాసులను అందజేశారు. ఇక మీదట గ్రామంలోని హోటళ్లలో ప్లాస్టిక్ టిఫిన్ ప్లేట్లు, ప్లాస్టిక్ టీ గ్లాసులు వాడొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. వ్యాపారులు కేవలం స్టీల్ గ్లాసులు, పళ్లాలను వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఎత్తొండను తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు సహకరించాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నవీన్, వార్డు సభ్యులు షేక్ మస్తాన్, రమేశ్, భూమేశ్ తదితరులు పాల్గొన్నారు.


