అదుపుతప్పి ఆటో బోల్తా
● ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు
వేల్పూర్(మెండోరా): మెండోరా మండలంలో సోమవారం మధ్యాహ్నం ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడగా, ఒకరు మృతిచెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్ సాయికుమార్ తన సొంత ప్యాసింజర్ ఆటోలో ముప్కాల్ నుంచి మెండోరా మండలానికి ఏడుగురు ప్రయాణికులను తీసుకెళ్తున్నాడు. మెండోరా శివారులోని కాకతీయ కాలువ సమీపంలో ఆటోను అజాగ్రత్తగా వేగంగా నడపడం వల్ల ఆటో ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో కోడిచెర్ల గ్రామానికి చెందిన వేల్పూర్ దేవాయి(58)కి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మిగతా ఆరుగురు ప్రయాణికులకు గాయాలు కాగా, వారి కుటుంబీకులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మృతురాలి కుటుంబీకులు ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
● డ్రైవర్కు తీవ్ర గాయాలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలకేంద్రం గోపాల్పేటలో ఆటోను కారు ఢీకొనడంతో ఆటోడ్రైవర్ తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గోపాల్పేటకు చెందిన షాహీద్ ఆఫ్రీదీ తన ఆటోలో స్థానిక పెట్రోల్బంకులో డీజీల్ పోయించుకొని ఇంటికి బయలుదేరాడు. అదేసమయంలో ఎల్లారెడ్డి వైపు నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఓ కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో నడుపుతున్న షాహీద్ ఆఫ్రీదీ తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం మొదట మెదక్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు.
వర్ని: మోస్రా మండలం చింతకుంట అటవీ ప్రాంతంలో ఉన్న శివకేశవ మందిరంలో గుర్తుతెలియని వ్యక్తులు రాధాకృష్ణ విగ్రహాలను ధ్వంసం చేశారు. సోమవారం ఆలయానికి వెళ్లిన భక్తులు విగ్రహాల ధ్వంసాన్ని గమనించి, గ్రామస్తులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.


