నిజామాబాద్ అర్బన్: సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ వి.భుజంగరావు హెచ్చరించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం అన్ని సంక్షేమ శాఖల ప్రభుత్వ విద్యాసంస్థల అధికారులు, నిర్వాహకులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల పలు హాస్టళ్లు, గురుకులాలను క్షేత్రస్థాయిలో సందర్శించగా, నిర్వహణపరమైన లోపాలు తన దృష్టికి వచ్చాయని అన్నారు. తక్షణమే వాటిని సరిదిద్దుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు డైట్ సమకూర్చాలని సూచించారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలు నాసిరకం వస్తువులు, చికెన్, మటన్ వంటివి సరఫరా చేస్తే వెంటనే షోకాజ్ నోటీసు జారీచేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించబోమని, నిబంధనలు పాటించని కాంట్రాక్టు ఏజెన్సీని రద్దు చేసి, కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టంచేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, సానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని హితవు పలికారు. మండల ప్రత్యేక అధికారులు, ఆర్సీవోలు క్రమం తప్పకుండా విద్యా సంస్థలను సందర్శిస్తూ, నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించాలని సూచించారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఈవో అశోక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలి
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
అదనపు కలెక్టర్ వి.భుజంగరావు
వెల్ఫేర్ హాస్టళ్ల అధికారులు,
నిర్వాహకులతో సమీక్ష


