నిజామాబాద్ నగరంలో లలితానగర్లోని ఓ వెంచర్లో నిలిచిన వర్షపు నీరు
ఆర్మూర్ పట్టణంలోని హుస్నాబాద్లో
కూలిన ఇల్లు
వేల్పూర్ మండలం అక్లూర్ వద్ద కప్పలవాగులో చెక్డ్యాం పైనుంచి ప్రవహిస్తున్న వరద నీరు
నిజామాబాద్అర్బన్: జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు ప్రవహిస్తుండగా.. ప్రాజెక్టుల్లోకి, చెరువుల్లోకి వరద నీరు చేరుతోంది. వర్షం నేపథ్యంలో గురువారం విద్యా సంస్థలకు బంద్ ప్రకటించారు. జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
మూడు రోజులుగా వర్షం కురుస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా 31 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సిరికొండ మండలం కొండూరు వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆలూర్ మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయ ప్రహరీ కూలింది. బోధన్ రూరల్ మండలం పెగడపల్లిలో దేవయ్య అనే వ్యక్తి చెందిన ఇల్లు కూలగా అందులో నివాసముంటున్న మూడు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ కోమటిపల్లి గ్రామాల మధ్య చెరువు అలుగు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గౌతంనగర్, చంద్రశేఖర్ కాలనీ, అర్సపల్లి, కంఠేశ్వర్ తదితర ప్రాంతాల్లో వరద నీరు భారీగా నిలిచింది. ముబారక్నగర్, గంగస్థాన్, వినాయక్ నగర్, ఎల్లమ్మగుట్ట ప్రాంతాల్లోని రోడ్లు జలమయమయ్యాయి. రైల్వే కమాన్ వద్దకు భారీగా వరదనీరు చేరింది.
జిల్లాకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ భుజంగరావుతో కలిసి పరిస్థితిపై సమీక్షించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఆందోళన చెందొద్దు..
ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కంట్రోల్ రూమ్(08462 220183)ను ఏర్పాటు చేశారు. భా రీ వర్ష సూచనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా సన్నద్ధంగా ఉండాలని క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిని అదనపు కలెక్టర్ భుజంగరావు ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి పూర్తి గా అదుపులోనే ఉందని, ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
పలు మండలాల్లో అధిక వర్షం
బుధవారం సాయంత్రం 5 నుంచి గురు వారం ఉదయం 8.30గంటల వరకు 984.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఆర్మూర్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి మండలాల్లో అత్యధికంగా వర్షం కురవగా, మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
ప్రాంతాల వారీగా కురిసిన వర్షం (మి.మీ.లలో)
ప్రాంతం వర్షపాతం
మగ్గిడి 78.3
తొండాకూర్ 67.8
కోనసముందర్ 66.0
పిప్రి 62.0
మచ్చర్ల 61.8
ఇస్సాపల్లి 60.3
బాల్కొండ 59.3
భీమ్గల్ 57.3
వేల్పూర్ 56.8
మల్కాపూర్ 56.8
వేంపల్లి 53.8
జక్రాన్పల్లి 50.0
మదన్పల్లి 50.0
మెండోరా 49.3
కమ్మర్పల్లి 47.5
ముప్కాల్ 47.5
తూంపల్లి 46.5
మోర్తాడ్ 45.3
మోస్రా 44.3
జాన్కంపేట 43.3
కోరట్పల్లి 43.0
ఆలూర్ 42.0
కల్దుర్కి 41.8
రుద్రూర్ 40.8
రెంజల్ 39.0
ఎడపల్లి 38.0
ధర్పల్లి 35.8
చిన్న మావంది 35.8
సీహెచ్ కొండూర్ 35.3
బెల్లాల్ 35.3
పాల్దా 35.3
గూపన్పల్లి 34.5
చీమన్పల్లి 33.5
కోటగిరి 32.2
మంచిప్ప 32.0
పొతంగల్ 32.2
జాకోరా 31.3
డిచ్పల్లి 29.3
ని.నార్త్ 29.3
ని.సౌత్ 27.8
సిరికొండ 25.5
గన్నారం 25.2
చందూర్ 23.5
నవీపేట 20.8
సాలూరా 16.2
లక్ష్మాపూర్ 6.0
మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు
ప్రవహిస్తున్న వాగులు.. నిండుతున్న
చెరువులు
పాక్షికంగా దెబ్బతిన్న 31 ఇళ్లు
కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు


