● వరద నీటితో నిండుతున్న గ్రామీణ
జలాశయాలు
● పంటలకు జీవం.. సాగుకు భరోసా
● రైతన్నల్లో ఆనందం
డొంకేశ్వర్(ఆర్మూర్) : జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురింపజేశాయి. మొన్నటి వరకు ఎల్నినో ప్రభావంతో అడుగంటి, బోసిపోయినట్లు దర్శనమిచ్చిన చెరువులు, కుంటలు తాజా వానలతో జలకళను సంతరించుకున్నాయి. పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు పూర్తిగా నిండి మత్తడి (అలుగు) పోస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 1,097 చెరువులు ఉండగా.. సగానికి పైగా చెరువులు 70శాతానికి పైగా నిండాయి. దీంతో తమ జీవనోపాధికి కూడా ఢోకా లేదని మత్స్యకారులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఒకేసారి చెరువులన్నీ జలమయం కావడంతో ఈ ఏడాది పంటలకు ఢోకా లేదని రైతాంగం ధీమా వ్యక్తం చేస్తోంది.
పంటలకు జీవం
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేస్తున్న పంటలు మొన్నటి వరకు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. రెండు రోజుల్లోనే ఈ వానలు వరితోపాటు మొక్కజొన్న, సోయా, పసుపు, ఇతర పంటలకు కొత్త ప్రాణం పోశాయి. దీంతో రైతులకు సాగునీటి బెంగ తీరింది. మొన్నటి వరకు నెమ్మదించిన వరినాట్లు కూడా పుంజుకున్నాయి. ఇప్పటి వరకు 3.36లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. రానున్న వారం రోజుల్లో మరింత పుంజుకొని 4లక్షల ఎకరాలు దాటే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.


