డొంకేశ్వర్(ఆర్మూర్): ఆహ్లాదాన్ని పంచే పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే పర్యాటకులు ముప్పు ముంగిట్లోకి వెళ్తున్నారు. కనుచూపు మేర పరుచుకున్న నీలి జలాలను చూస్తూ ఉత్సాహాన్ని ఆపుకోలేక నీటిలోకి దిగుతున్నారు. వీకెండ్ వస్తే చాలు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతం పర్యాటక జోష్తో కిటకిటలాడుతోంది. సరదాగా వచ్చిన పర్యాటకులు లోతైన నీటిలోకి దిగి ప్రమాదకర ఆటలాడుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అయితే ప్రకృతి అందాల్లోనే కనిపించని మృత్యు కు హరాలు నోళ్లు తెరిచి ఉన్నాయి. ఎస్సారెస్పీలో ముంపునకు గురైన పాత ఊళ్ల బావులు, మట్టి కో సం తవ్విన లోతైన గుంతలు చాలా ఉన్నాయి. ము ఖ్యంగా మద్యం మత్తులో యువత సరదాగా ఈత కొట్టేందుకు నీటిలోకి దిగడంతో ప్రాణాలు నీటిలో కలిసిపోయే ప్రమాదముంది. చిన్నయానం, గాదేపల్లి, జీజీ నడ్కుడ, గంగాసముందర్, అన్నారం, సి ర్పూర్, నికాల్పూర్, డొంకేశ్వర్, నూత్పల్లి బ్యాక్ వాటర్ ప్రాంతాలతోపాటు ఏకో టూరిజం స్పాట్గా మారిన చిన్నయానం ప్రాంతానికి ఎక్కువ సంఖ్య లో పర్యాటకులు వస్తున్నారు. వారిని హెచ్చరించేందుకు, ప్రమాదాలను నిలువరించేందుకు అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు కనిపించకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు కానీ, పర్యాటకులకు నియంత్రించేందుకు పోలీసులు, ఇతర యంత్రాంగం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు.
మద్యం మత్తు..
ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతం అందాలను వీక్షించడానికి వచ్చిన కొందరు పర్యాటకులు, యువకులు వారి వెంట మద్యాన్ని తెచ్చుకుంటున్నారు. తాగిన సీసాలను అక్కడే పడేసి మత్తులో ఏమీకాదనే నిర్లక్ష్యంతో లోతును లెక్కచేకుండా నీటిలోకి దిగుతున్నారు. ప్రమాదాలన్నీ ఇలాంటి నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి. మద్యం సేవించొద్దని చిన్నయానం, గాదేపల్లి గ్రామ పంచాయతీలు బ్యానర్లు కట్టించినా కొందరు పర్యాటకులు పట్టించుకోవడం లేదు.
ఆదివారం రోజున ఎస్సారెస్పీ నీటిలోకి వెళ్లిన పర్యాటకులు
కరువైన పర్యవేక్షణ, కనిపించని
హెచ్చరిక బోర్డులు
ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో
మృత్యుకుహరాలు
తాజా ఘటనతోనైనా అధికారులు మేల్కొంటారా?


