రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
నవీపేట: మండలంలోని యంచ గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన కారడి జలాబాయి(68) అనే వృద్ధురాలు మృతి చెందినట్లు ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో బాసర రహదారిని దాటుతుండగా బాసర వైపు వేగంగా వెళ్తున్న బైక్ ఢీకొన్నది. మట్టయ్య పారం గ్రామానికి చెందిన తౌడు గంగాధర్ అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారకుడయ్యారని పేర్కొన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడు ఒడ్డెన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ వివాహిత ..
నాగిరెడ్డిపేట: కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వివాహిత చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపేట మండలం తాండూర్కు చెందిన మునిగెపల్లి జయవ్వ(50) అనే వివాహిత కుటుంబ కలహాలతో ఈ నెల 12న ఇంట్లో విషపదార్థం సేవించింది. గమనించిన కుటుంబీకులు చికిత్స కోసం ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
మాచారెడ్డి: పాల్వంచ మండలం ఎల్పుగొండలో తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. మాచారెడ్డి ఎస్సై విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెందిన ఎడ్ల శిరీష ఈనెల 17న ఆస్పత్రికి వెళ్లారు. మరునాడు రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగుల గొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించింది. బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ. 30వేల నగదు చోరీకి గురైనట్లు బాధితురాలు తెలిపింది. ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


