● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ రూరల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ బోనాలు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఆదివారం నగరంలోని కోటగల్లిలో ఉన్న కట్ట మైసమ్మ ఆలయం, నాందేవ్ వాడ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగలలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆషాఢ మాసం తెలంగాణకు ప్రత్యేక మాసం అన్నారు. గ్రామ దేవతలను పూజిస్తూ.. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పశువులు ఆరోగ్యంగా ఉండాలని కొలిచే పండుగ అన్నారు. బోనాలు కేవలం పండుగ మాత్రమే కాదని, ఇది మన పూర్వీకుల సంప్రదాయాన్ని.. గ్రామదేవతలపై ఉన్న విశ్వాసాన్ని తరతరాలకు అందించే ఆధ్యాత్మిక వేడుక అన్నారు. బోనం అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చింతకాయల రాజేందర్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, కోటగల్లి మైసమ్మ ఆలయ ప్రతినిధులు దేవేందర్, గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.


