బోధన్రూరల్: పట్టణంలో ఇస్కాన్ బోధన్ ఆధ్వర్యంలో ఆదివారం జగన్నాథ స్వామివారి రథయాత్ర వైభవంగా నిర్వహించారు. పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథంపై జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఉంచి పట్టణంలో రథయాత్ర చేపట్టారు. శక్కర్నగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, అంబేడ్కర్ చౌరస్తా, పాత బస్టాండ్, రైల్వే గేట్మీదుగా కొనసాగి టీటీడీ కల్యాణ మండపం వద్ద ముగిసింది. రథయాత్రకు పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ‘జై జగన్నాథ‘ నామస్మరణలతో రథాన్ని లాగుతూ రథయాత్రతో పాల్గొన్నారు. రథయాత్ర సందర్భంగా నిర్వాహకులు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. రథయాత్ర మార్గమంతా భజనలు, హరినామ సంకీర్తనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.


