● ఐదు బృందాలు..
24 గంటలపాటు కీర్తనలు
● డిచ్పల్లి మండలం రాంపూర్లో
భజన సప్తాహం
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్) : వర్షాకాలం ప్రారంభమై నెలన్నర గడిచినా సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరుణుడి కరుణ కోసం వరుణ యాగాలు, పూజలు, భజనలు చేస్తున్నారు. డిచ్పల్లి మండలంలోని రాంపూర్లోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వీడీసీ ఆధ్వర్యంలో భజన సప్తాహం నిర్వహిస్తున్నారు. గురువారం ప్రారంభమైన సప్తాహం కొనసాగుతోంది.
పాపాయి తిరుపతి, గూండ్ల చిన్నారెడ్డి, కాయితి రాజు, లింగులు రాజారెడ్డి, సూర నరేష్ నేతృత్వంలో ఒక్కో భజన బృందం సభ్యులు 4 గంటలపాటు భజన పాటలు పాడుతున్నారు. విడతల వారీగా 24 గంటలపాటు ఆగకుండా భజన కొనసాగుతోంది. వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ 15 ఏళ్లుగా ఏటా సప్తాహం నిర్వహిస్తున్నామని వీడీసీ సభ్యులు తెలిపారు.
అలాగే పలు గ్రామాల్లో ప్రజలు వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కప్పతల్లి ఆటలు, గ్రామదేవతలకు జలాభిషేకాలు, భజనలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.


