కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణానికి 2 కిలో మీటర్ల దూరంలో బడా భీమ్గల్లో కొలువుదీరిన పెద్దంగంటి ఎల్ల మ్మ భక్తుల కొంగుబంగారం. ఇక్కడి అమ్మవారిని దర్శించుకుంటే చర్మ వ్యాధులు మటు మాయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధు లు రాకుండా నివారిస్తే.. పోచమ్మ పోషణ కలిగిస్తుందని భక్తుల విశ్వాసం. బడా భీమ్గల్లో పచ్చని వాతావరణంలో చెట్ల మధ్య అన్ని వసతులతో కొలువై ఉన్న పెద్దంగంటి ఎల్లమ్మ తల్లిని ప్రతి ఆదివారం, మంగళవారాల్లో జిల్లాకు చెందిన వారితోపాటు జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి దర్శించుకుంటారు. ఆషాఢ మాసం ఆదివారాలు మహిళలు మొక్కులు చెల్లించుకొని బోనాలను సమర్పిస్తారు. ఈ ఆలయానికి 700 ఏళ్ల చరిత్ర ఉందని చరిత్రకారులు తెలిపారు. ఆలయ పరిసరాల్లో 10వ శతాబ్దం నాటి చాళుక్యుల కాలపు రెండంతస్తుల వీరగల్లు లభించడం చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశం. ఇలాంటి అరుదైన శిల్పాలు మన పూర్వీకుల శౌర్యపరాక్రమాలకు, నాటి యుద్ధ నైపుణ్యాలకు ప్రతీకలు.


