● వీసీలో డీజీపీ(లా అండ్ ఆర్డర్)
మహేశ్ భగవత్
నిజామాబాద్అర్బన్: పుష్కరాల సందర్భంగా అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్యకు సలహాలు, సూచనలు ఇచ్చారు. పుష్కరాల నేపథ్యంలో ఘాట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ, క్రౌడ్ మేనేజ్మెంట్, పార్కింగ్ ఏర్పాటు, క్యూ లైన్ వ్యవస్థ, అత్యవసర సేవలు, విపత్తుల నిర్వహణ, డ్రోన్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, కమాండ్ కంట్రోల్ సెంటర్లో పనితీరు తదితర అంశాలపై సమీక్షించారు. అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని, తప్పిపోయిన వారి కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వీసీలో అదనపు డీసీపీ శుభం ప్రకాశ్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ప్రకాశ్యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.


