పాముకాటుతో బాలుడి మృతి
భిక్కనూరు: మండలంలోని భాగిర్తిపల్లి గ్రామంలో పాముకాటుకు ఓ బాలుడు మృతిచెందాడు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గొండ్ర నవీన్ (15) అనే బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. శనివారం వేకువజామున అతడు నిద్ర నుంచి లేచి, మూత్రవిసర్జనకు ఇంటి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో పాటు అతడి కాలుపై కాటు వేసింది. వెంటనే ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలుపగా వారు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. నవీన్ మృతితో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.
కాలువలో పడి ఒకరు..
బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలోని కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలు ఇలా.. బీర్కూర్లోని సంగెం విఠల్(39) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి కాలకృత్యాలు తీర్చుకునేందుకు డబుల్ బెడ్రూం కాలనీ వద్ద గల కాలువ వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలువలో పడి నీటమునిగి మృతిచెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసే నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రైలు నుంచి జారిపడి..
ఇందల్వాయి: మండలంలోని సిర్నాపల్లి–ఇందల్వాయి రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం అర్ధరాత్రి రైలు నుంచి జారి పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్లోని పూలాంగ్ చౌరస్తాకు చెందిన షేక్ లతీఫ్(40) అనే వ్యక్తి కామారెడ్డి రైల్వే స్టేషన్లో నర్సాపూర్–నాగర్సోల్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కాడు. నిజామాబాద్కు వస్తుండగా సిర్నాపల్లి–ఇందల్వాయి రైల్వే స్టేషన్ల మధ్య లతీఫ్ డోర్ వద్ద అజాగ్రత్తగా ఉండటంతో పట్టుతప్పి కిందపడి తలకు తీవ్ర గాయమై మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులకు సమాచారం అందించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
నవీపేట: మండలంలోని యంచ శివారులోని గోదావరి నదిలో శనివారం గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, వయస్సు సుమారు 50 ఏళ్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. చామనఛాయ రంగులో ఉన్నాడని, మెరూన్ రంగు నిక్కర్ ధరించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా ఆచూకీ తెలి స్తే బాసర ఎస్హెచ్వో 8712659540ను సంప్రదించాలని సూచించారు.


