ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు గురువారం నిజామాబాద్ రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ ఏఎస్సై డెబ్బర్మ ఆధ్వర్యంలో రైల్వే భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రామ్మోహన్రెడ్డి, ఆర్పీఎఫ్ ఏఎస్సై డెబ్బర్మ మాట్లాడుతూ.. సరైన అవగాహన కలిగి ఉంటే ప్రమాదాలు, సమస్యలను అధిగమించవచ్చని అన్నారు. రైల్వే ప్రాంగణంలో, ట్రాక్ ప్రాంతంలో, ప్లాట్ఫారంలపై నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. రైలు కదులుతున్నప్పుడు ఎక్కడం, దిగడం, డోర్ దగ్గర నిలబడి ప్రయాణం చేయరాదని, ఏదైనా అక్రమ రవాణాలు, దొంగతనాలు గమనిస్తే వెంటనే రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ కి సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, రమేశ్ గౌడ్, వినయకుమార్, దండు స్వామి, రామస్వామి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


