భిక్కనూరు: తప్పిపోయిన బాలుడి ఆచూకిని పోలీసులు రెండు గంటల్లో కనుగొని తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రం సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన కమ్మరిపల్లి రుత్విక్ అనే పదేళ్ల విద్యార్థి ఇటీవల ఐదో తరగతిలో ప్రవేశం పొందాడు. రుత్విక్ మధ్యాహ్నం 12 గంటలకు పాఠశాలలో కనిపించకపోవడంతో ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ నరేశ్ ఎస్పీ రాజేశ్ చంద్రకు సమాచారం అందించాడు. ఎస్పీ ఆదేశాలతో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో భిక్కనూరు సీఐ నరేశ్ రెండు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి బాలుడి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు గంట ప్రాంతంలో పెద్ద మల్లారెడ్డి వెళ్లే రోడ్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల క్రీడామైదానంలో రుత్విక్ ఒంటరిగా ఉండటాన్ని పోలీసులు గుర్తించి పీఎస్కు తీసుకొచ్చారు. ప్రిన్సిపాల్ రఘుతో పాటు రుత్విక్ తండ్రి రాజును పోలీస్ స్టేషన్కు పిలిపించి బాలుడిని అప్పగించారు.


