ఖలీల్వాడి: ప్రభుత్వ బడుల్లో బ్లాక్ బోర్డు, చాక్పీస్కే పరిమితమైన బోధన త్వరలోనే డిజిటల్ రూపం దాల్చునున్నది. పుస్తకాలతోపాటు కంప్యూటర్ స్క్రీన్పై పాఠాలు చూసే అవకాశం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. విద్యను ఆసక్తికరంగా, సులభం చేయడంతోపాటు సాంకేతికతతో అనుసంధానం చేసే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాలోని 191 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను తీసుకువస్తోంది. 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు డిజిటల్ బోధన ద్వారా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను సొంతం చేసుకునే అవకాశం లభించనుంది. 2008లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో కంప్యూటర్ విద్యను ప్రారంభించగా.. 2014 వరకు కొనసాగింది. ఆ తర్వాత కంప్యూటర్ విద్య అటకెక్కింది. ప్రభుత్వం మళ్లీ కంప్యూటర్ విద్యను తీసుకురానుండడంతో విద్యార్థులకు పోటీ ప్రపంచంలో మేలు చేకూరనుంది.
191 ప్రభుత్వ పాఠశాలల్లో..
జిల్లాలో 769 ప్రాథమిక, 132 ప్రాథమికోన్నత, 299 ఉన్నత పాఠశాలలు ఉండగా, 96 వేల మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తు తం కొన్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్ విద్య అమలవుతోంది. ప్రస్తుతం పీఎంశ్రీ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అమలవుతుండగా, మిగతా ప్రభుత్వ, జెడ్పీ, మోడల్ స్కూల్, కేజీబీవీల్లో కంప్యూటర్ విద్య అమలు కానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా ప్రపంచ స్థా యి డిజిటల్ విద్యను అందిపుచ్చుకునే రోజులు వచ్చాయి. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా కంప్యూటర్, డిజిటల్ కంటెంట్, ఆడియో విజువల్ పాఠాల ద్వారా నేర్చుకునే అవకాశం కల్పించనున్నారు.
గ్రామీణ విద్యార్థులకు వరం..
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇప్పటికే డిజిటల్ బోధన అందుబాటులో ఉండగా, గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సదుపాయాలు పరిమితంగానే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆధారిత విద్య అమలుతో గ్రామీణ విద్యార్థులు కూడా ఆధునిక సాంకేతిక విద్యను అందిపుచ్చుకునే అవకాశం కలగనుంది.
వారంలో మూడు రోజులు..
ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఓ ప్రయివేట్ కన్సల్టెన్సీ వారు పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అమలు చేయనున్నారు. పాఠశాలలో వారానికి మూడు రోజులపాటు విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందిస్తారు. పాడైన కంప్యూటర్లను ఇప్పటికే బాగు చేయించాం.
– డి సాయాగౌడ్, ఇన్చార్జి డీఈవో
డిజిటల్ నైపుణ్యాలే భవిష్యత్..
ప్రపంచం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగు లు వేస్తోంది. ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్, ఆరోగ్యం, విద్య, పరిశ్రమలు, వ్యాపారం, వ్యవసాయం, పరిశోధన, ఉద్యోగ రంగాలు అన్నీ కంప్యూటర్ సాంకేతికతపై ఆధారపడుతున్నాయి. ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నా యి. దీంతో విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే డిజిటల్ ప్రపంచాన్ని అర్థం చేసుకునే లా ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొస్తోంది.
జిల్లాలో 191 ప్రభుత్వ
పాఠశాలల ఎంపిక
ఆరో తరగతి నుంచి
పదో తరగతి వరకు బోధన
విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాల
పెంపే లక్ష్యం


