● నిజామాబాద్ రూరల్
ఎమ్మెల్యే భూపతిరెడ్డి
● అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో కొనసాగిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’
నిజామాబాద్ రూరల్/ సిరికొండ: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వ స్థలాల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని, పిచ్చి మొక్కలను తొలగించారు. రూరల్ మండల కాలూర్ గ్రామంలో నిర్వహించిన పరిశుభ్రథ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుంటే ప్రతిపక్షాలు అనవసరపు విమర్శలు చేస్తున్నాయని అన్నారు. కాలూర్లో స్థానిక నాయకులతో కలిసి పారిశుద్ధ్య పనులు, రోడ్డును శుభ్రం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని వారిని నమ్మొద్దని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో రాబోవు రోజుల్లో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు.
కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, నాయకులు బాగారెడ్డి, కార్పొరేటర్ అగ్గు భోజన్న, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ మండలంలోని గడ్కోల్, చిన్నవాల్గోట్ గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీలను శుభ్రం చేశారు. గడ్కోల్లో సర్పంచ్ లత, ఉపసర్పంచ్ సంపత్రెడ్డి, చిన్నవాల్గోట్లో సర్పంచ్ దడివె గణేశ్, ఉపసర్పంచ్ రొండ్ల గోవర్ధన్రెడ్డి, జీపీ కార్యదర్శి శరణ్య, కారొబార్ సాయి తదితరులు పాల్గొన్నారు.


