ముగిసిన ఎస్‌జీఎఫ్‌ జిల్లా జట్టు శిక్షణ శిబిరం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎస్‌జీఎఫ్‌ జిల్లా జట్టు శిక్షణ శిబిరం

Mar 7 2026 7:25 AM | Updated on Mar 7 2026 7:25 AM

ముగిసిన ఎస్‌జీఎఫ్‌ జిల్లా జట్టు శిక్షణ శిబిరం ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంను సద్వినియోగం చేసుకోవాలి ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌లో చేరిక

డిచ్‌పల్లి: మండలంలోని సుద్దపల్లిలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 2 నుంచి 6 వరకు నిర్వహించిన 69వ ఎస్‌జీఎఫ్‌ జిల్లా సాఫ్ట్‌బాల్‌ అండర్‌–14 బాలికల జట్టు శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. పాఠశాల ప్రిన్సిపాల్‌ నళిని మాట్లాడుతూ.. ఈనెల 7 నుంచి 9 వరకు మహబూబాబాద్‌ జిల్లాలోని నెల్లికుదురు జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టును మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు మర్కంటి సుజాత, గంగా మోహన్‌, చిప్ప నవీన్‌, జ్యోత్స్న, మెండె రమేశ్‌, మౌనిక, నర్మదా, అనికేత్‌, అర్చన తదితరులు పాల్గొన్నారు.

తెయూ(డిచ్‌పల్లి): తెయూ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్‌, టాస్క్‌ సహకారంతో ఈ నెల 10, 11వ తేదీల్లో ‘ఏఐ యుగంలో విద్య’ అనే అంశం పై నిర్వహించనున్న రెండు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంను సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ట్రార్‌ యాదగిరి సూచించారు. శుక్రవారం తన చాంబర్‌లో తెయూ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ ఆరతి, ప్రోగ్రాం కన్వీనర్‌ అతిక్‌ సుల్తాన్‌ ఘోరీ తో కలిసి రిజిస్ట్రార్‌ ప్రోగ్రాం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ.. పరిశోధన, వినియోగాలలో ఏఐ ప్రాముఖ్యత, ఆధునిక విద్యా విధానంలో ఏఐ సాంకేతిక పరిజ్ఞానం, సవాళ్లు, అవరోధాలు, పరిష్కారాలు ఈ శిక్షణా కార్యక్రమంలో చర్చిస్తారని తెలిపారు. తెయూ పరిధిలోని అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలల సిబ్బంది ఈ నెల 9వ తేదీ లోపు గూగుల్‌ ఫారం ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి నీలిమ, అధ్యాపకులు నందిని, భ్రమరాంబిక, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

సుభాష్‌నగర్‌: నగరంలోని ఏఐటీయూసీ కా ర్యాలయంలో ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ మాజీ నాయకుడు డీ సంజీవ్‌ శుక్రవారం చేరారు. ఆయనకు యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం వెంకట్‌ గౌడ్‌, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, యూనియన్‌ రీజినల్‌ కార్యదర్శి సాయిలు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వెంకట్‌గౌడ్‌, ఓమయ్య మాట్లాడుతూ.. ఆర్టీసీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవడం కోసం రాష్ట్రవ్యాప్తంగా జేఏసీ ఏర్పడిందని తెలిపారు. ఆర్టీసీలో సుమారు 20వేల ఖాళీలు ఏర్పడ్డాయని, వాటిని భర్తీ చేయాలని డిమాండ్‌చేశారు. రాబోయే కాలంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని సంజీవ్‌ తెలిపారు. నాయకులు పీ సుధాకర్‌, విఠల్‌ గౌడ్‌, రాధాకుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement