● జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క
● నగరంలో నేషనల్ సెక్యూరిటీ
కౌన్సిల్ సమావేశం
నిజామాబాద్అర్బన్: మనమందరం మహిళలకు మంచి అవకాశాలను ఇవ్వడమే కాకుండా వారికి బాసటగా నిలుద్దామంటూ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మహిళలకు సమాన అవకాశాలను ఇచ్చినట్లయితే వారి నుంచి సమాజ అభివృద్ధికి ఎంతో పొందుతామన్నారు. నగరంలోని విజయలక్ష్మి గార్డెన్లో శుక్రవారం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స మా వేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తన జీవితాన్ని ఒక ఉదాహరణగా, ఆదర్శవంతమైన మహిళగా తీర్చిదిద్దుకొనుటకు చదువు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి మహిళ కమిట్మెంట్ అండ్ కరేజ్ను కలిగి ఉండాలన్నారు. ఛాలెంజ్ లేని జీవితం చప్పడి కూర వంటిదన్నారు. పదవ తరగతి చదువుతూ విప్లవోద్యమంలో వెళ్లిన తను ఒక నక్సలైట్గా ఏ కో ర్టులో నిల్చున్నానో, అదే కోర్టు లో నేను అడ్వకేట్గా నిలిచినట్లు పేర్కొన్నారు. అనంతరం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కరపత్రాలను విడుదల చేశారు. సురక్ష దీప అన్న భద్రత బోర్డులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఏర్పాటు చేయాలని సీపీ పేర్కొన్నారు. ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. మహిళలు సమాజంలో అభివృద్ధి చెందేందుకు పాటుపడాలన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మేయర్ ఉమారాణి, కౌన్సిల్ కన్వీనర్ అదనపు డీసీపీ బస్వారెడ్డి, కోశాధికారి సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి కవితరెడ్డి, సభ్యు లు కాకతీయ కళాశాల కరస్పాండెంట్ రజినీకాంత్, కామారెడ్డి ఏసీపీ చైతన్యరెడ్డి, కామారెడ్డి డీఎఫ్వో నికిత, నూడా చైర్మన్ కేశవ వేణు పాల్గొన్నారు.


