నిజామబాద్ అర్బన్: పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యమివ్వాలని, రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖరీఫ్, రబీ సీజన్లకు కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి, రానున్న సీజన్లో రైతాంగానికి అందించాల్సిన పంట రుణాలు తదితర అంశాలపై బ్యాంకుల వారీగా అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఆయా రంగాల్లో పలు బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందిస్తుండగా, మరికొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉన్నాయని అన్నారు. వందశాతం లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను సమర్ధవంతంగా అందించాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఇబ్బంది లేకుండా అర్హత కలిగిన రైస్మిల్లర్లకు వెనువెంటనే బ్యాంకు గ్యారెంటీలను మంజూరు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించి స్వయం ఉపాధికి చేయూతనివ్వాలని హితవు పలికారు. ఎస్బీఐ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పూర్తిచేసుకున్న యువతకు యూనిట్ల స్థాపన కోసం రుణాలు అందించాలన్నారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్డీవో పథ్వీ, డీఆర్డీవో సాయాగౌడ్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ అశోక్ చవాన్, నాబార్డు ఏజీఎం ప్రవీణ్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ సురేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశంలో
అదనపు కలెక్టర్ అంకిత్