దొంగ నోట్ల పంచాయితీ
● ఎన్నికల సమయంలో వర్ని మండలం
జలాల్పూర్లో పంపిణీ
● మహారాష్ట్ర నుంచి జడ్చర్ల మీదుగా జిల్లాలోకి..
● రూ.లక్షకు రూ.3 లక్షలు
తీసుకొచ్చిన ఘనులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : వర్ని మండలం జలాల్పూర్లో జాలీ నోట్లు వెలుగు చూడడంతో ఎక్కడివారక్కడ అప్రమత్తమయ్యారు. జలాల్పూర్ నుంచి వచ్చారా? అయితే నగదు వద్దు.. డిజిటల్ పేమెంట్లు మాత్రమే చేయండి.. వర్ని, బోధన్, బాన్సువాడ పట్టణాల్లో వ్యాపారులు ప్రత్యేకంగా ఇలా చెబుతుండడం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు పోలీసులు కేసులు నమోదు చేస్తారనే భయంతో తమ వద్ద ఉన్న రూ.500 నోట్లను గ్రామస్తులు కాల్చివేస్తుండడం విశేషం. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జలాల్పూర్ గ్రామంలో ఓటర్లకు దొంగనోట్లు పంపిణీ చేసిన ఘటన విస్తుగొలుపుతోంది. సర్పంచ్ అభ్యర్థి తమకు నకిలీ కరెన్సీ ఇచ్చి మోసం చేశాడని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
జలాల్పూర్కు చెందిన కల్యాణ్, గోపాల్, శంకర్, రవి అనే నలుగురు వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నుంచి ఈ దొంగనోట్లు తీసుకువచ్చారు. మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతం నుంచి జడ్చర్లకు నకిలీ నోట్లు రాగా, రూ.1 లక్షకు రూ.3 లక్షల చొప్పున రూ.500 నకిలీ నోట్లను తెచ్చారు. గత మూడు నెలల కాలంలో రెండుసార్లు ఇలా దొంగనోట్లను తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే నోట్ల చలామణి ప్రయత్నం ఆదిలోనే బెడిసికొట్టింది. పెట్రోల్ బంక్లో చలామణి చేసేందుకు ప్రయత్నం చేయగా బెడిసికొట్టింది. బంక్లో తీసుకోకపోవడంతో మరో మార్గం ఆలోచించారు. అదే సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో ఆ నోట్లను ఖర్చు పెట్టినట్లు తెలిసింది.


