సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33 శాతం కోటా అమలు చేసేందుకు రంగం సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో మహిళలకు ఎన్ని అసెంబ్లీ సీట్లు కేటాయిస్తారనే అంశంపై అన్ని వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పుడున్న లోక్సభ, శాసనసభ సీట్ల సంఖ్యను 50 శాతం వరకు పెంచనున్నట్లు కేంద్రం నుంచి సంకేతాలు వచ్చాయి. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో శాసనసభ స్థానాలు 119 నుంచి 182కు, లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 9 అసెంబ్లీ సీట్ల సంఖ్య 13కు పెరగనున్నట్లు అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో 15,71,022 మంది, కామారెడ్డి జిల్లాలో 9,72,625 మంది జనాభా ఉంది. గత ఎన్నికల(2023) లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ ని యోజకవర్గాల్లో కలిపి మొత్తం 20,06,494 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 9,58,718 మంది కాగా, మహిళా ఓటర్లు 10,47,674 మంది, ఇతరులు 102 మంది ఉన్నారు. మహిళల ఓట్లు 88,956 ఎ క్కువ ఉన్నాయి. విడివిడిగా చూసినా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లోనూ మహి ళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. అయి తే ఇతర జిల్లాలతో పోల్చినా ఉమ్మడి జిల్లాలో మహిళా జనాభా, ఓట్ల శాతం అధికంగా ఉంది. తాజాగా చేపడుతున్న జనాభా లెక్కల మేరకు సైతం ఉమ్మడి జిల్లాలో మహిళా జనాభా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన పక్షంలో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 182కు పెరిగితే మహిళలకు 60 సీట్లు దక్కనున్నాయి. ఇందులో సైతం మహిళల కోటా విషయానికి వస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి గణనీయంగానే మహిళల ప్రాతినిథ్యం దక్కవచ్చని అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా జనరల్ మహిళ స్థానాలు సైతం ఇక్కడి నుంచి ఆశించిన స్థాయిలో కేటాయించే అవకాశాలు ఉన్నట్లు చర్చ నడుస్తోంది. దీంతో అన్ని పార్టీలతోపాటు మహిళా నాయకులు సైతం చట్టసభలో ప్రాతినిథ్యం కోసం లెక్కలు వేసుకుంటున్నారు. జనగణన, కులగణన తరువాత వెంటనే నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధం చేస్తుండడంతో అన్నివర్గాల్లో ఈ చర్చ నడుస్తోంది.
ఉమ్మడి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఓటర్ల వివరాలు (2023)
నియోజకవర్గాల పునర్విభజన..
మహిళలకు 33శాతం కోటా
నేపథ్యంలో చర్చ
కోటా అమలైతే జిల్లా నుంచి
నాలుగు సీట్లు మహిళలకే..
ఉమ్మడి జిల్లాలో మహిళల జనాభా,
ఓట్ల శాతం ఎక్కువ
పురుషులతో పోలిస్తే
మహిళల ఓట్లు 88,956 అధికం


