● 15 వేల చేపలు మృతి చెంది ఉంటాయని మత్స్యకారుల ఆవేదన
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఊర చెరువులో నీరు కలుషితం కావడంతో చేపలు మృత్యువాత పడ్డాయి. చెరువు వద్దకు గురువారం ఉదయం చేరుకున్న మత్య్యకారులకు వేల సంఖ్యలో చేపలు మృతిచెంది నీటిలో తేలడంతో ఆందోళనకు గురయ్యారు. ఆర్మూర్ పట్టణంతోపాటు పెర్కిట్ నివాస గృహాల నుంచి మురికి నీరు చెరువులో చేరి కలుషితమవుతోంది. దీంతో ప్రతీ సంవత్సరం చేపలు మృతి చెందుతున్నాయి. గత సంవత్సరం మార్చిలో 50 వేల చేపపిల్లలను చెరువులో వదిలారు. అందులో 15 వేల చేపలు మృతిచెంది ఉంటాయని గంగపుత్రులు భావిస్తున్నారు. దీంతో సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా మత్య్సశాఖ మాజీ డైరెక్టర్ బట్టు నరేందర్ మాట్లాడుతూ.. పెర్కిట్ ఊర చెరువు ఆర్మూర్తోపాటు పెర్కిట్ నివాస గృహాల నుంచి వస్తున్న మురికి నీటితో కలుషితమవుతోంది. అలా గే చికెన్ సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను చెరువులో వదిలి వెళ్తున్నారు. దీంతో నీరు కలుషితమై ప్రతి యేటా చేపలు మృత్యువాత పడుతున్నాయన్నారు. అధికారులు స్పందించి చెరువు కలుషితం కాకుండా కాపాడాలని కోరారు.


