సుభాష్నగర్: ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ స భలు విజయవంతమయ్యాయి. 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం జిల్లాలోని 545 పంచాయతీల్లో గ్రామ సభలు, నిజామాబాద్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలోని 146 వార్డుల్లో వార్డు సభలు నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో గ్రామ, వార్డు సభలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎండను దృష్టిలో ఉంచుకుని ఉదయం 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు సభలను నిర్వహించారు. ప్రతిచోట నీడ కోసం షామియానాలు, తాగునీరు, కుర్చీలు ఏర్పాటు చేసి, ఫిర్యాదుల బాక్సులు అందుబాటులో ఉంచారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సభల్లో భాగస్వాములు కాగా, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి మోస్రాలో నిర్వహించిన గ్రామసభతోపాటు బోధన్ మున్సిపల్ పట్టణంలోని 26, 35 వార్డుల్లో నిర్వహించిన వార్డు సభల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లిలో, నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి నగర పాలక సంస్థ పరిధిలోని 49వ డివిజన్ కసాబ్గల్లిలో నిర్వహించిన వార్డు సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్కుమార్ మాక్లూర్ మండలం మామిడిపల్లిలో, ఇన్చార్జి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దిలీప్కుమార్ మోపాల్ మండలం తాడెం గ్రామసభలో పాల్గొన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ సిరికొండ మండల కేంద్రంలో, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్, చౌట్పల్లిలో, మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధర్గౌడ్ డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామసభలో భాగస్వాములయ్యారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ ఏర్గట్ల మండలం తడ్పాకల్లో, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో రెంజల్ మండలం దూపల్లి గ్రామ సభలో పాల్గొన్నారు.
పాల్గొన్న ఉన్నతాధికారులు,
ప్రజాప్రతినిధులు
సభా ప్రాంగణాల్లో టెంట్లు, తాగునీరు, ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు
స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు


