స్వాతంత్య్రం వచ్చేనని.. | - | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్రం వచ్చేనని..

Aug 15 2026 12:22 AM | Updated on Aug 15 2026 12:22 AM

● అప్పట్లో గ్రామాల్లో సంబరాలు ● నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్న పెద్దలు

దొర ఇంట్లోనే కరెంటు ఉండే..

బజార్‌హత్నూర్‌: నా పేరు నారడి మల్లయ్య, వయస్సు 95. 1947 ఆగస్టు 15రోజు నా వయస్సు 16 సంవత్సరాలు. అప్పుడు మా మండలం మొత్తం దొరల పాలనలో ఉండేది. పల్సికార్‌ రంగారావ్‌(పల్సి దొర) బజార్‌హత్నూర్‌ వతందార్‌. దొర ఇంట్లో తప్ప మా గ్రామంలో కరెంటు లేదు. ఆ రోజు అర్ధరాత్రి రేడియోలో బ్రిటీష్‌ వాళ్లు మన దేశానికి స్వాతంత్య్రం ఇచ్చారని నెహ్రూ ప్రసంగం విన్నారు. తెల్లవారుజాము నుంచే గ్రామంలో కోలాహలం ఉండే. పల్సికార్‌ రంగారావ్‌ ఆధ్వర్యంలో దొడ్డి మీద జాతీయ జెండాను ఆవిష్కరించారు. నేను మా నాన్న మల్లన్నతో కలిసి మా గ్రామంలో స్వతంత్ర దినోత్సవం సంబరాల కార్యక్రమానికి వెళ్లాను. డప్పులతో గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. భారతమాతకి జై, వందేమాతరం నినాదాలు చేశారు. తర్వాత అందరికీ మిఠాయిలు పంచి పెట్టారు.

– నారడి మల్లయ్య, బజార్‌హత్నూర్‌

స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో నాడు ఊరు..వాడ.. చిన్నా పెద్ద అందరూ పాల్గొన్నారు. అప్పటి వేడుకలకు సజీవసాక్ష్యంగా నిలిచిన పెద్దలు ఆనందంతో పంచుకున్నారు. నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement