భైంసారూరల్: మండలంలో ఇటీవల జరుగుతున్న దొంగతనాలతో గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు. చోరీల నియంత్రణకు పోలీసులు చేపడుతున్న రాత్రి పెట్రోలింగ్కు గ్రామస్తులు భక్తి మార్గంలో బాసటగా నిలుస్తున్నారు. మండలంలోని మిర్జాపూర్, వానల్పహాడ్, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో రాత్రివేళల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా గ్రామస్తులు భజనలు చేస్తూ అప్రమత్తంగా ఉంటున్నారు. భజన పేరుతో ఒకచోట చేరి రాత్రివేళల్లో అప్రమత్తంగా ఉండటంతోపాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెడుతున్నారు.
ప్రజల భాగస్వామ్యమే బలం...
నేరాలను అరికట్టడంలో పోలీసుల చర్యలకు ప్రజల సహకారం ఎంతో కీలకమని ఎస్సై సుప్రియ అన్నారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా పోలీసులకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీసులు–ప్రజలు కలిసి పనిచేస్తే భద్రత మరింత పటిష్టమవుతుందని, ప్రజల్లో భద్రతపై నమ్మకం పెంచడంతోపాటు నేరగాళ్లలో భయం కలిగించవచ్చని వివరించారు. ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు పెంచుతూ నేరాల నియంత్రణలో వారిని భాగస్వాములను చేస్తున్న ఎస్పీ, ఏఎస్పీ చర్యలను ప్రజలు అభినందిస్తున్నారు.


