నిర్మల్టౌన్: కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్లో జైల్భరో కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గంటపాటు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్, టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజన్న మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూల, కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలకు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మె హక్కు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రతను కాపాడాలని కోరారు. మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


