బాసర: బాసరలో సోమవారం ఏఎస్పీ సాయికిరణ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకుచేపట్టిన ఈ తనిఖీల్లో పోలీసులు ఇంటింటికీ వెళ్లి ధ్రువపత్రాలు, అనుమానాస్పద వ్యక్తుల వివరాలు, వాహనాల వివరాలు నమోద చేసుకున్నారు. సరైన పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, ఒక లారీతోపాటు నంబర్ ప్లేట్ లేని నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ, ఇటీవల బాసరలోని మహాకాళి అమ్మవారి ఆలయంలో జరిగిన కిరీటం చోరీ కేసును వేగంగా ఛేదించి నిందితులను పట్టుకున్న పోలీసు బృందాన్ని అభినందించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు వచ్చే వరకు వేచి చూడకుండా వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలిస్తే, ‘గోల్డెన్ అవర్’ పథకం కింద ప్రభుత్వం రూ.5 వేల ప్రోత్సాహకం అందిస్తుందని వివరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీ కాలనీ, ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలు నియంత్రించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ముధోల్ సీఐ రవీందర్, బాసర సీఐ దీపక్, ముధోల్ ఎస్సై, బైంసా–ముధోల్–బాసర పోలీస్ సిబ్బంది, బాసర సర్పంచ్ వెంకటేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


