నిర్మల్టౌన్: స్నేహం అంటే సంతోషంలో పంచుకునే చిరునవ్వు మాత్రమే కాదు.. కష్టాల్లో కన్నీటిని తుడిచే నమ్మకం. మనసుకు తోడుగా నిలిచే ఆ బంధాన్ని కాపాడుకోవడం నిజమైన స్నేహితుడి బాధ్యత. ఆపదలో అండగా నిలిచి, కన్నీటిలో ఓదార్పునిచ్చే బంధమే స్నేహం. నేడు అదే నమ్మకం కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతోంది. నిన్నటి వరకు భుజం భుజం కలిపి తిరిగిన మిత్రులే చిన్నపాటి వివాదాలు, క్షణికావేశాలు, ఆర్థిక లావాదేవీలతో బద్ధ శత్రువులుగా మారుతున్నారు. నమ్మిన స్నేహమే నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నతీరు ఆందోళన కలిగిస్తోంది.
జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనలు..
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలం రాంపూర్కు చెందిన పంచగూడ సాయితేజ(26)ను అతని స్నేహితుడు రాయరం రాజశేఖర్ ఈనెల 16న హత్య చేశాడు. సాయితేజను వెంట తీసుకెళ్లిన రాజశేఖర్ మార్గమధ్యలో మద్యం సేవించారు. మార్గం మధ్యలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయితేజకు గాయాలయ్యాయి. తర్వాత చికిత్స కోసం నిజాబాబాద్కు తీసుకెళ్తున్న క్రమంలో ప్రమాదం గురించి పోలీసులకు చెప్తానని సాయితేజ అనడంతో భయపడిన రాజశేఖర్ అతనిని హత్య చేసి మృతదేహాన్ని వదిలి పరారయ్యాడు.
జూన్ 28న బైంసాకు చెందిన షేక్ సోహెబ్(19)ను అతని స్నేహితులైన అనగందుల సాగర్, గుండెన విజయ్ కలిసి హత్య చేశారు. సోహెబ్ గతంలో సాగర్ వద్ద రూ.2 వేలు అప్పుగా తీసుకున్నాడు. డబ్బులు, చేతి గడియారం విషయంలో విభేదాలు తలెత్తడంతో వారు సోహెబ్పై దాడి చేసి హత్య చేశారు. నేరాన్ని దాచిపెట్టేందుకు మృతదేహాన్ని సమీపంలోని బావిలో పడేశారు. ముగ్గురు స్నేహితుల్లో ఇద్దరు కలిసి మరో స్నేహితుడిని హతమార్చడం కలకలం రేపింది.


