● పోక్సో, బాలల హక్కులు, సైబర్ భద్రతపై అవగాహన అవసరం ● జిల్లా జడ్జి శ్రీవాణి
నిర్మల్టౌన్: బాలల రక్షణ, భద్రతలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా న్యాయసేవ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బాలల రక్షణ చట్టాలు, బాలల స్నేహపూర్వక న్యాయ సేవాపథకం తదితర అంశాలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ.. బాలలపై జరిగే అఘాయిత్యాలపై ఉపాధ్యాయులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పోక్సో చట్టం, బాలల హక్కులు, రక్షణ చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. పాఠశాలలు పిల్లలకు సురక్షితమైన ప్రదేశాలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ భద్రత, ఇంటర్నెట్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆన్న్లైన్ మోసాలు, దోపిడీ వంటి ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. పిల్లలను శిక్షించే విధానానికి బదులుగా సంస్కరణాత్మక, సహాయక వాతావరణంలో తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. బాలల హక్కులను కాపాడుతూ వారి భవిష్యత్కు బంగారు బాటలు వేయడంలో ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శుభకరణ్, డీఈవో భోజన్న, జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, జిల్లా బాలల సంరక్షణ అధికారి మురళి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


