నిర్మల్టౌన్: వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరా ల సందర్భంగా భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై డీజీపీ కార్యాలయం నుంచి ఏడీజీపీ(లాఅండ్ ఆర్డర్) మహేష్ మురళీధర్ భగవత్ జిల్లాల పోలీస్ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ జానకీషర్మిల పాల్గొన్నారు. పుష్కర ఘాట్ల వద్ద వాచ్ టవర్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, సీసీటీవీ నిఘా వ్యవస్థలు, డ్రోన్ సర్వైలెన్స్, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర స్పందన బృందాలు తదితర భద్రతా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఏడీజీపీ ఆదేశించారు. నిర్మల్ జిల్లా బాసర, సోన్, సావర్గాం ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా సమగ్ర ప్రణాళిక రూపొందించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఎస్పీ శ్రీనివాస్, ఏవో యూనస్ అలీ, సోన్ సీఐ గోవర్ధన్రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


