కడెం ప్రాజెక్టులోకి బుధవారం మధ్యాహ్నం ఈ సీజన్లోనే అత్యధికంగా 22,505 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. వర్షాలు తగ్గడంతో సాయంత్రానికి 10,470 క్యూసెక్కులకు పడిపోయింది. నీటిమట్టం 1.484 టీఎంసీలకు చేరింది.
స్వర్ణప్రాజెక్టులోకి బుధవారం సాయంత్రానికి 1,296 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 1173.8 అడుగులకు చేరింది.
గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగింది. బుధవారం ఉదయం 156 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే వచ్చింది. మొత్తం సామర్థ్యం 358.70 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 355.70 మీటర్లకు చేరింది. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తేనే గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి వరదనీరు రానుంది.
మామడ మండలం పొన్కల్వద్ద గోదావరిపై నూతనంగా నిర్మించిన సదర్మట్ బ్యారేజీ లోకి సాయంత్రం 7,100 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగింది. పూర్తిసామర్థ్యం 276 మీటర్లు కాగా ప్రస్తుతం 274 మీటర్లకు చేరుకుంది.
ఖానాపూర్ వద్ద గోదావరిపై గల సదర్మట్ ఆనకట్ట జలకళతో పరవళ్లు తొక్కుతోంది.
ముగిసిన వ్యాస పౌర్ణమి..
బాసర ఆలయంలో మూడు రోజులుగా నిర్వహించిన వ్యాస పౌర్ణమి (గురుపూజ) ఉత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి.
ప్రాజెక్టుల్లోకి వరద
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
నిర్మల్: జిల్లాలో రెండు మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండురోజులూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. తాజాగా మంగళవారం రాత్రి ఏకధాటిగా కురిసిన వానకు జిల్లాలోని కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టులు, సదర్మట్ బ్యారేజీలోకి క్రమంగా వరద చేరుతోంది. వాగులు, చెరువులకు జలకళ వస్తోంది. భారీ వర్షాలు కురిసిన చోట వాగులు పొంగుతున్నాయి. పలుచోట్ల వరదనీరు రోడ్లను దెబ్బతీసింది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. మరోవైపు ఖానాపూర్ మండలం ఎర్వచింతల్ పరిధిలో ఉప్పొంగిన బల్లివాగు పార్వతీబాయి(48)ని బలిగొంది. చామన్పల్లి గూడేన్ని విషాదంలో ముంచింది.
నిర్మల్, కడెంలో భారీగా వాన..
జిల్లాలో ఈ సీజన్లో మంగళవారం ఒక్కరోజే భారీ వర్షం కురిసింది. సగటున 82.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇందులో నిర్మల్అర్బన్ (132.3 మి.మీ.), కడెం(131.2 మి.మీ.), సోన్ (130.3 మి.మీ.), మామడ (115.8 మి.మీ.), నిర్మల్ రూరల్ (110.6 మి.మీ.), ఖానాపూర్ (108.4 మి.మీ.) మండలాల్లో భారీ వర్షం కురిసింది. రెండురోజులుగా ముసురు పెట్టినట్లున్న వాన ఒక్కసారిగా జోరందుకుంది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు, కడెంలోని రహదారులు జలమయం అయ్యాయి. పలుచోట్ల గుడిసెలు కూలిపోయి పశువులకు గాయాలయ్యాయి. లక్ష్మణచాంద మండలంలోని ధర్మారం–సోన్ రహదారి వరదకు కొట్టుకుపోయింది.
ఇంకా సాధారణమే..
జూన్ 1 నుంచి జూలై 29 వరకు నమోదైన సమీకృత వర్షపాతం సాధారణ స్థాయిలోనే ఉంది. పలు మండలాల్లో ఇంకా లోటు కొనసాగుతోంది. జిల్లా సాధారణ వర్షపాతం 459.3 మిల్లీమీటర్లు కాగా, ఈనెల 29 వరకు వాస్తవంగా 396.2 మిల్లీమీటర్లు నమోదైంది. సాధారణంతో పోలిస్తే 13.7 శాతం లోటు నమోదైంది. జిల్లాలో మొత్తం ఐదు మండలాలు లోటు వర్షపాతం కేటగిరీలో ఉన్నాయి. కుభీర్ (–37శాతం), తానూర్ (–35శాతం), బాసర (–31శాతం), ముధోల్ (–23శాతం), సారంగాపూర్(–21శాతం)మండలాల్లో సాధారణంతో పోలిస్తే గణనీయమైన వర్షాభావం ఉంది. భైంసా, కుంటాల, నర్సాపూర్(జి), లోకేశ్వరం, దిలావర్పూర్, నిర్మల్అర్బన్, నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచాంద, మామడ, పెంబి, ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. పెంబి (+10శాతం), కడెం(+7శాతం), నిర్మల్అర్బన్(+6శాతం) మండలాలు సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షపాతం ఉంది.
వర్షంతో రైతన్న హర్షం..
ఈ సీజన్లో ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉండనుందని పంటలకు ఇబ్బందికరంగా ఉంటుందని అధికారులు చెప్పడంతో రైతులు ఢీలాపడ్డారు. తాజాగా కురుస్తున్న వర్షాలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే నాలుగైదు రోజులు కురిస్తే.. వానాకాలం పంట వెళ్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం తర్వాత వర్షాలు కురిసే అవకాశాలు ఉండవని, పంటకుంటలు తవ్వించుకుని నీటిని కాపాడుకోవాలని, ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాలని సూచిస్తున్నారు.
ఖానాపూర్ వద్ద సదర్మట్ పాత ఆనకట్టపై నుంచి గోదావరి పరవళ్లు
జలాశయాలకు జలకళ..
నేడు, రేపు భారీ వర్షసూచన
జిల్లాలో గురు, శుక్రవారాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. ఈ మేరకు జిల్లావాసులు, ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.


