
రాష్ట్రంలో అరాచక పాలన
● ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి గుణపాఠం తప్పదు.. ● ఎమ్మెల్యే రామారావ్ పటేల్.. ● ట్రిపుల్ ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ధర్నాకు సంఘీభావం..
బాసర: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రజలు గుణపాఠం చెబుతారని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు శుక్రవారం ధర్నా చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు ఎమ్మెల్యే సంఘీభావం తెలిపి మాట్లాడారు. జీవో 21తో ఏళ్లుగా పని చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్నారు. తక్షణమే జీవను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో 13 యూనివర్సిటీలో 900 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారని తెలిపారు. అందులో 200 మంది మహిళా ప్రొఫెసర్లు అని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని వారు ముఖ్యమంత్రి వద్దకు వెళితే అరెస్ట్ చేసి నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి గెలిచాక మాట తప్పడం సరికాదన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించండి
ఆర్జీయూకేటీ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్కి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వినతిపత్రం అందజేశారు. జీవో 21 రద్దు చేయాలని అధ్యక్షుడు శ్రీశైలం కోరా రు. తమ సర్వీసులను క్రమబద్ధీకరించిన తర్వాతనే రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వాలని వీసీ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో సభ్యులు డాక్టర్ విజయ్కుమార్, డాక్టర్ మధుసూదన్, శ్రీధర్, హరికృష్ణ తదితరులు ఉన్నారు.