రిసార్టులో ప్రియురాలు మరణించగా, ప్రియుడు చావుబతుకుల్లో పడి ఉండడం మిస్టరీగా మారింది. చిక్కబళ్లాపురం నగర శివార్లలో ప్రసిద్ధి చెందిన నంది హిల్స్ సమీపంలో ఉన్న ఓ హోమ్ స్టేలో యువతి అనుమానాస్పదంగా శవమై తేలింది. ఆమెను కేరళకు చెందిన సాయి సురభి (23)గా పోలీసులు గుర్తించారు. ఈమె ప్రియుడు, కేరళ కోజికోడ్కు చెందిన సంజిత్ అలీ (24) రక్త గాయాలతో పడి ఉన్నాడు. సురభిని హత్యచేసి తరువాత సంజీత్ ఆత్మహత్యాయత్నం చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
రూం ఖాళీ చేయకపోవడంతో
వివరాలు.. సంజీత్ బెంగళూరులో క్యాబ్ డ్రైవర్గా పనిచేసేవాడని సమాచారం. గత శనివారం ముద్దేనహళ్లి సమీపంలోని హోం స్టేకు వీరిద్దరూ వచ్చారు. సోమవారం రూమ్ ఖాళీ చేస్తామని తెలిపారు. టైం దాటినా ఖాళీ చేయలేదు. దీంతో సిబ్బంది లోపలికి తొంగి చూడగా ఆమె చనిపోయి ఉంది. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ కుశాల్ చౌక్సీ, నందిగిరి ధామ పోలీసులు చేరుకుని పరిశీలించారు. యువతి ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. అలాగే కొన్ని మాత్రలు కూడా కనిపించాయి. ఒక డైరీ లభించింది. అపస్మారక స్థితిలో ఉన్న సంజీత్ని ఆస్పత్రికి తరలించారు.
నా కూతుర్ని వేధించేవాడు..
సురభి తల్లి గీతా బోరున విలపిస్తూ ఘటనా స్థలికి చేరుకుంది. ఇదొక లవ్ జిహాద్ హత్య అని ఆమె ఆరోపించింది. బెంగళూరు దయానంద సాగర్ కాలేజీలో చదువుతున్న సమయంలో సంజీత్ అలి పరిచయం అయ్యాడని, ప్రేమ పేరిట వేధించేవాడని గీతా తెలిపింది. అతనినుంచి కాపాడుకునేందుకు కూతురును వేరే చోట ఉంచి చదివిస్తున్నట్లు తెలిపింది. తన కుమార్తెను అతడు పూర్తిగా నాశనం చేశాడని, డ్రగ్స్కు అలవాటు చేశాడని తెలిపింది. తాను కష్టపడి రెండు , మూడుచోట్ల ఆమెకు చికిత్స చేయించి బాగు చేసుకున్నానని చెప్పింది.
ఇటీవలే ముద్దేనహళ్లిలో ఓ సెంటర్లో ఫిజియోథెరపిస్టుగా సురభి చేరిందని, శనివారం సత్సంగం ఉందని చెప్పి వెళ్లిందని వివరించింది. అయితే ఈ సంజీత్ ఆమెను నమ్మించి హోంస్టేకు తీసుకెళ్లి హత్య చేశాడని ఆరోపించింది. యువతి మామ శంకరనారాయణ పోలీసులపై మండిపడ్డారు. సంజీత్ అలీ వేధింపులపై గతంలో తాము ఫిర్యాదు చేశామని, పోలీసులు పట్టించుకోలేదని, అప్పుడే అతనిపై చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు సురభి బతికి ఉండేదని రోదించారు. మరోవైపు గతేడాది సురభి మిస్సింగ్పై బనశంకరి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. అప్పుడు స్నేహితురాలి ఇంటిలో సురభిని గుర్తించి పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.
కర్ణాటక:


