సీఏఏ అమలుపై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు | West Bengal CM Mamata Banerjee Comments On CAA Law | Sakshi
Sakshi News home page

సీఏఏ అమలుపై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

Mar 12 2024 5:50 PM | Updated on Mar 12 2024 6:17 PM

West Bengal CM Mamata Banerjee Comments On CAA Law - Sakshi

పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 'మమతా బెనర్జీ' తీవ్రంగా విమర్శించారు. ఇది బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన 'లూడో మూవ్' అని ఆరోపించారు. దేశంలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న చర్య అని మండిపడ్డారు. 

బెంగాల్‌లోని హబ్రాలో జరిగిన అడ్మినిస్ట్రేటివ్ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. పౌరసత్వ హక్కులను హరించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సీఏఏ చట్టబద్ధతపై తనకు అనుమానం ఉందని, దీనిపై ఎలాంటి క్లారిటీ లేదని, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రచారమని వ్యాఖ్యానించారు.

సీఏఏ మీకు హక్కులు కల్పిస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ మీరు పౌరసత్వం కోసం అప్లై చేసుకున్న మరుక్షణం అక్రమ వలసదారులుగా మారి మీ హక్కులను కోల్పోతారు. దయచేసి దరఖాస్తు చేసే ముందు ఆలోచించండి అని మమతా బెనర్జీ అన్నారు.

సీఏఏ బెంగాల్‌లో జరగడానికి నేను అనుమతించను. మతం ఆధారంగా పౌరసత్వం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? బెంగాల్‌ను విభజించడానికి ఇది బీజేపీ మరో గేమ్ అని మమతా వెల్లడించారు. మనమంతా భారత పౌరులమేనని నొక్కి చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టడానికే ఈ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement