
విడాకులైనా ఆమెకే సొంతం
కేరళ హైకోర్టు కీలక తీర్పు
తిరువనంతపురం: పెళ్లి సమయంలో వధువుకు బహుమతిగా ఇచ్చే బంగారు నగలు, నగదుపై హక్కెవరిదనే అంశంపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వాటిని స్త్రీ ధనంగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అవి పూర్తిగా ఆ మహిళకే చెందుతాయని, చట్టబద్ధమైన పూర్తి హక్కులు ఆమెకే ఉంటాయని జస్టిస్ దివాన్ రామచంద్రన్, జస్టిస్ ఎంబీ స్నేహలతల ధర్మాసనం తెలిపింది. విడాకుల తర్వాత పెళ్లినాటి బంగారు నగలపై మహిళకు ఎలాంటి హక్కులేదంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎర్నాకులంలోని కలమసెర్రికి చెందిన మహిళ వేసిన పిటిషన్పై ఈ మేరకు తీర్పు వెలువరించింది.
దురదృష్టవశాత్తూ భర్త, అత్తింటి వారు అలాంటి విలువైన ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకున్న అనేక సందర్భాలున్నాయని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అనధికారికంగా చేతులు మారే ఇటువంటి ప్రైవేటు ఆస్తులపై తమకు హక్కుందని ప్రకటించుకునేందుకు అవసరమైన పత్రాలు మహిళల వద్ద ఉండవని, ఇలాంటి సందర్భాల్లో కోర్టులు విచక్షణను ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపింది. 2010లో వివాహం సమయంలో పుట్టింటి వారు తమకు 63 సవర్ల బంగారంతోపాటు, రెండు సవర్ల గొలుసును, బంధువుల నుంచి అదనంగా మరో 6 సవర్ల ఆభరణాలు బహుమతిగా వచ్చాయని పిటిషనర్ తెలిపారు.
వీటిలో మంగళసూత్రం, ఒక బంగారు గాజు, రెండు రింగులను మాత్రమే తనవద్ద ఉంచి మిగతా అన్నిటినీ భద్రత కోసమంటూ అత్తింటి వారు తీసుకున్నారని తెలిపారు. అదనంగా మరో రూ.5 లక్షలు డిమాండ్ చేయడంతో పుట్టింటికి వెళ్లగొట్టారని తెలిపారు. భర్త తన నగలను బ్యాంకులో ఉంచినట్లు తెలిపే పత్రాలను ఆమె కోర్టుముందుంచారు. పరిశీలించిన ధర్మాసనం 59.5 సవర్ల బంగారాన్ని లేదా మార్కెట్ విలువ ప్రకారం డబ్బు ఇవ్వాలని భర్తను ఆదేశించింది. బంధువులిచ్చిన నగలు, ఇతర విలువైన వస్తువులను కూడా ఇప్పించాలంటూ పిటిషనర్ చేసిన వినతిపై ధర్మాసనం.. తగు ఆధారాలు లేనందున తామేమీ చేయలేమని తెలిపింది.