18 ఏళ్లు పైబడిన వారికి టీకా : ఖర్చు ఎంతో తెలుసా? | Vaccinating Indians above 18 years to cost less than pc of annual GDP: India Ratings | Sakshi
Sakshi News home page

18 ఏళ్లు పైబడిన వారికి టీకా:  ఖర్చు ఎంతో తెలుసా?

Apr 23 2021 6:44 PM | Updated on Apr 23 2021 8:44 PM

 Vaccinating Indians above 18 years to cost less than pc of annual GDP: India Ratings - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  మే 1  తేదీనుంచి 18 ఏళ్లు పైబడిన   ప్రతీ ఒక్కరికీ కరోనా వైరస్‌ టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో  ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ కీలక విషయాలను వెల్లడించింది. జీడీపీలో ఒక శాతానికంటే  తక్కువేనని తాజా అధ్యయనంలో  తెలిపింది.  133.26 కోట్ల జనాభాలో దేశంలో 18 సంవత్సరాలు పైబడిన  మొత్తం జనాభా 84.19 కోట్లు ఉంటుందని, వీరికి  టీకా వేసేందుకు అయ్యే ఖర్చు 67,193 కోట్ల రూపాయలని వెల్లడించింది.  ఇంటులో రాష్ట్రాలు  వాటా రూ .46,323 కోట్లుగా తేల్చింది. కేంద్ర ప్రభుత్వానికి రూ .20,870 కోట్లు, రాష్ట్రాలకు కలిసి రూ .46,323 కోట్లు ఖర్చవుతాయని లెక్కించింది. కరోనావైరస్ వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై కేంద్రం, రాష్ట్రాల మధ్య తీవ్ర చర్చ  నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజిస్తే, అప్పుడు యూనియన్ బడ్జెట్‌పై ఆర్థిక ప్రభావం  జీడీపీలో 0.12 శాతం మాత్రమేనని,  రాష్ట్ర బడ్జెట్లపై లో 0.24 శాతం ఉంటుందని చెప్పింది. .గరిష్ట ప్రభావం బీహార్ (స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో 0.60 శాతం , ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ (0.47 శాతం), జార్ఖండ్ (0.37 శాతం), మణిపూర్ (0.36 శాతం), అస్సాం (0.35 శాతం) శాతం), మధ్యప్రదేశ్ (0.30 శాతం), ఒడిశా (0.30 శాతం)గా ఉంటుందని తేల్చి చెప్పింది. కేరళ, ఛత్తీస్‌గఢ్‌, బిహార్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు టీకా ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ఇప్పటికే ప్రకటించినవిషయాన్ని గుర్తు చేసింది.   టీకా ద్వారా వచ్చిన యాంటిబాడీస్‌ జీవితకాలం 12-18 నెలల వరకు ప రిమితం కాబట్టి ఈ వ్యయాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది.

మరోవైపు భారత వృద్ధి రేటును 2021-22కు 10.1 శాతానికి తగ్గించింది. గతంలో వృద్ధి రేటును 10.4 శాతంగా ఇండియా రేటింగ్ సంస్థ అంచనా వేసింది. సెకండ్‌ వేవ్‌లో కరోనా  ఉధృతి, టీకా పంపిణీ వేగంగా లేకపోవడమే వృద్ధి అంచనాను తగ్గించడానికి కారణంగా రేటింగ్ ఏజెన్సీ ప్రకటించింది. దేశంలోని కీలక ప్రాంతాల్లో వైద్య మౌలిక సదుపాయాలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని, అయితే మే మధ్య నాటికి సెకెండ్ వేవ్ ప్రభావం తగ్గుతుందని ఆశిస్తున్నట్టు  పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణ 5 శాతం, టోకు ద్రవ్యోల్బణ 5.9 శాతం ఉండొచ్చని అంచనా వేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement